“జాతీయ ప్రయోజనాల పేరు చెప్పి గొప్పలకు పోయిన ‘కమలం’.. ‘చీపురు’ ప్రభంజనం ముందు మరోసారి వాడిపోయింది. ‘ఆమ్ ఆద్మీ’ హ్యాట్రిక్ సాధించింది. కేజ్రీవాల్నే నమ్మి ప్రజలు ఆయన పార్టీకి మూడోసారి పట్టం కట్టబెట్టారు. మోదీ నాయకత్వంలో జాతీయస్థాయిలో బలంగా ఎదిగిన బీజేపీకి ఇది గర్వభంగం.. ఆర్టికల్ 370, అయోధ్య, పౌరసత్వ చట్టసవరణలు తమ గొప్ప అన్న మోదీ ప్రచారాన్ని ప్రజలు విశ్వసించలేదు. అవి విద్వేష రాజకీయాలుగా భావించి తిప్పికొట్టారు. అవినీతికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ చేసిన ఉద్యమం, ఆ ధ్యేయంతోటే పార్టీ ఏర్పాటుచేసి అధికారంలోకి వొచ్చి సగటు ప్రజల అవసరాలను తీర్చడమే పరమావధిగా పాలనలో మార్పులు తీసుకురావడం.. ముఖ్యంగా విద్యా, వైద్యరంగాల్లో ప్రభుత్వసేవలను సామాన్యుల ముంగిట్లోకి చేర్చడం.. ఉచితవిద్యుత్ వంటి పథకాలు ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి. స్థానిక అంశాలను ఏమాత్రం పట్టించుకోకుండా జాతీయ అంశాలను ఏకరువుపెట్టిన బీజేపీ వ్యూహం బెడిసికొట్టింది. ఇక నాయకత్వలోపంతో ఉన్న కాంగ్రెస్ పత్తాలేకుండా పోయింది.”
- చిత్తుగా ఓడిన బీజేపీ.. కాంగ్రెస్కు రిక్తహస్తం
- ఆమ్ ఆద్మీని గెలిపించిన సంక్షేమ పథకాలు
- ప్రజలకు మరింత సేవ చేస్తాం: కేజ్రీవాల్
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. బిజెపిని సింగిల్ డిజిట్కే పరిమితం చేస్తూ 62 స్థానాల్లో విజయం సాధించింది. బిజెపి కేవలం 8 సీట్లతో సరిపెట్టుకుంది. కాగా, కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. ఈ సారి కూడా ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవకపోగా.. ఏ తరుణంలోనూ కనీసం ఆధిక్యం కూడా ప్రదర్శించ లేదు. ఇక వరుసగా మూడో సారి ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజీవ్రాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి బంపర్ మెజార్టీ రావడం, నేటితో అసెంబ్లీ కాలపరిమితి ముగియడంతో ఢిల్లీ శాసనసభను లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ రద్దు చేశారు. త్వరలోనే కేజీవ్రాల్ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి అఖండ విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు ఆ పార్టీ కన్వీనర్, సీఎం అరవింద్ కేజీవ్రాల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్ వన్ సైడ్గా నిలిచిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సీఎం కేజీవ్రాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఇది ఢిల్లీ ప్రజలు విజయం. ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు. అభివృద్ద్ధికి ప్రజలు వోటేశారు. ఈ విజయం కొత్త రాజకీయాలకు నాంది. ఢిల్లీ తన కుమారుడిని మరోసారి నమ్మింది’ అంటూ ఆ ప్రకటనలో కేజీవ్రాల్ పేర్కొన్నారు. ఒంటిచేత్తో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ను ధీటుగా ఎదుర్కొని కనీవినీ ఎరుగని రీతిలో మరోసారి బంపర్ విక్టరీ సాధించిన అరవింద్ కేజీవ్రాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు సరికొత్త తీర్పునిచ్చారని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవ్రాల్ అన్నారు. ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో అరవింద్ కేజీవ్రాల్ డియాతో మాట్లాడుతూ..ఆమ్ ఆద్మీ పార్టీపై నమ్మకముంచి మూడోసారి గెలిపించిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు. ఇవాళ ఢిల్లీ ప్రజలకు లార్డ్ హనుమాన్ దీవెనలు అందించారు. వచ్చే ఐదేళ్లలో ఢిల్లీ ప్రజలకు మరింత సేవ చేసేందుకు సరైన మార్గాన్ని చూపాలని హనుమాన్ను కేజీవ్రాల్ కోరుకున్నారు. ఢిల్లీ ప్రజలకు కల్పించిన సౌకర్యాలే మాకు గెలుపు బాటలు పరిచాయి. ఢిల్లీ ప్రజలకు తక్కువ ధరకే విద్యుత్ అందించాం. సామాన్యుడి కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపించాయి. విద్యుత్, నీటి సరఫరా, పౌరసేవలే మమ్మల్ని గెలిపించాయి. విద్య, వైద్యం కోసం చేసిన కృషికి ప్రజలు మళ్లీ మమ్మల్ని ఆదరించారు. మరో ఐదేళ్లపాటు మనమందరం కలిసి కష్టపడదామని కేజీవ్రాల్ పిలుపునిచ్చారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి మరోసారి నిరాశే ఎదురైంది. వోట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి 20కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టు కనిపించిన బీజేపీ మెల్లిమెల్లిగా పట్టువదిలింది. సింగిల్ డిజిట్ స్థానాలకే బీజేపీ పరిమితమయ్యింది. కేజ్రీవాల్కు కలిసొచ్చిన భార్య పుట్టిన రోజ్లు ఎన్నికల్లో ఘన విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్కు డబుల్ ధమాకాలా ఆయన భార్య సునీతా పుట్టినరోజు కూడా మంగళవారం రావడం కలిసివచ్చింది.భార్య బర్త్డే వేడుకలతో పాటు ఢిల్లీ ప్రజలు తన సర్కార్కు మరోసారి పట్టంకట్టడంతో కేజ్రీ ఉత్సాహం రెట్టింపైంది. తన భర్త కోసం విస్తృతంగా ప్రచారం చేసిన సునీతా కేజ్రీవాల్ (54)కు ట్విటర్లో జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.కేజ్రీవాల్ రాజకీయాల్లో ప్రవేశించకముందు ఇద్దరూఐఆర్ఎస్ అధికారులుగా పనిచేశారు.