- ఎస్కార్ట్ వాహనం,మెకానిక్లను వెంట పంపాలి
- అధికారులతో సమీక్షించిన సిఎస్ సోమేశ్ కుమార్
ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి తరలించే ఆక్సీజన్ రవాణాలో ఎలాంటి జాప్యం లేకుండా ఆయా శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ట్రాన్స్ పోర్టు, ఆర్.టి.సి అధికారులతో సోమేశ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ ట్యాంకర్లను పంపి , తిరిగి తెప్పించుటలో వేగాన్ని పెంచుటకై చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. మన రాష్ట్రానికి ఒడిశాలోని అంగూర్ నుండి , కర్టాటక లోని బళ్లారి నుండి మెడికల్ ఆక్సిజన్ ను ట్యాంకర్ల ద్వారా తెప్పిస్తున్నామని ప్రధాన కార్యదర్శి తెలిపారు.
రవాణాలో జాప్యాన్ని నివారించుటకు పోలీస్ ఎస్కార్ట్ వాహనాలతో పాటు, మెకానిక్ లు,ఇతర నిపుణుల బృందాలను ఏర్పాటు చేయాలని ఆధికారులను ఆదేశించారు. ఆక్సిజన్ ట్యాంకర్లతో ప్రయాణించే ఆక్సిజన్ ఎక్స్ప్రె కు రైల్వే శాఖ ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానల్ సదుపాయాన్నివినియోగించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసు కోవాలని సూచించారు. తద్వారా అంగూర్ కు ప్రయాణ సమయాన్ని ఆరు రోజుల నుండి మూడు రోజులకు తగ్గించగలుగుతామని పేర్కొన్నారు. కార్గో విమానాల ద్వారా సులభంగా ఆక్సిజన్ ట్యాంకర్లను తరలిం చుటకు అనువుగా ట్యాంకర్లకు తగు మార్పులు చేయాలని అధికారులకు సూచించారు.
నిర్దేశిత పాయింట్లకు ఆక్సిజన్ ట్యాంకర్లను నడపుటకు 24 గంటలు పని చేసే విధంగా ఆర్.టి.సి. డ్రైవర్లు, మెకానిక్ ల బృందాలను ఏర్పాటు చేయాలని రవాణా అధికారులను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ప్రస్తుతం వున్న 30 ఆక్సిజన్ ట్యాంకర్లకు అదనంగా మరికొన్ని ట్యాంకర్లను సమకూర్చుకొనేందుకు ప్రైవేట్ కాంట్రాక్టర్ల తో చర్చించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, జి.ఏ,డి ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ , పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, తదితర అధికారులు పాల్గొన్నారు.