రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల అర్బన్, జులై 31 (ప్రజాతంత్ర విలేఖరి) : దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కరీంనగర్ పట్టభద్ర ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేవలం ఎన్నికల హామీలా కాకుండా, ఎన్నికలకు ముందే హుజరాబాద్ లో అమలు చేస్తామని ప్రకటించినట్లుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని జీవన్ రెడ్డి కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగలేదని సామాజిక తెలంగాణ నిర్మాణంకోసం కొట్లాడి తెలంగాణ సాధించుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ సాధించుకుందా మనడం సరికాదని, బంగారు తెలంగాణ కాదు అన్నివర్గాలకు బతుకుదెరువు చూపెట్టాలని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి సూచించారు. జగిత్యాలలోని ఇందిరా భవన్ లో శనివారం జీవన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగనని గత ఎన్నికల్లో చెప్పిన మాదిరిగానే రాష్ట్రంలోని ప్రతీ దళిత కుటుంబానికి రూ.10 లక్షల సాయం చేయకుంటే వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఓట్లు అడగనని ప్రతిజ్ఞ చేయాలని కేసీఆర్ కు జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళితబందు మంచి కార్యక్రమామని చేబుతూ..ఈ పథకం హుజురాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని చేస్తున్నారా.. దళితుల సంక్షేమం కోసం చేస్తున్నారా అని ప్రశ్నించారు.
రాష్ట్ర వ్యాప్తంగా దళితబందు ను అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాటలుతప్పే ముఖ్యమంత్రి కేసీఆర్ కాదని దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ చేయలేదంటే అనుభవంలేదని మొదటి సారీ ఉపముఖ్యమంత్రి ఇచ్చి అనుభవం రాగానే రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తారనుకుంటే ఉపముఖ్యమంత్రి పదవే ఊడగొట్టారని విమర్శిస్తూ దళితుల పాలనపట్ల కేసీఆర్ కు ఎందుకు అనుమాన మని ప్రశ్నించారు. కొత్తగా పెళ్ళైనవారికి కల్యాణలక్ష్మి తోపాటు వారు జీవనం చేయడానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కావాలని, వారి నిధులతోనే నిర్మించి ఇవ్వాలని సూచించారు. రాజ్యాంగ సూచనల కనుగుణంగా రాష్ట్రంలో రిజర్వుడు ఎస్సీ స్థానాల మేరకు దళితులకు ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒక్క కొప్పుల ఈశ్వర్ కే పరిమితం చేసి నిర్లక్ష్యం చేశారని, దళితుల్లో ఎక్కువ జనాభా ఉన్న మాదిగ సామాజిక వర్గానికి మంత్రి మండలిలో చోటు దక్కకపోవడం శోచనియమని వెంటనే మరో ఇద్దరు దళితులకు మంత్రి పదవులు ఇవ్వాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఏడు సంవత్సరాల కాలంలో 35 వేల కోట్ల ఎస్సీ డెవలప్మెంట్ నిధులు ఖర్చుకాకుండా సీఎం దగ్గరే మూలుగుతు న్నాయని, వెంటనే దళితుల సంక్షేమానికి వెచ్చించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు. దళితులకు మూడేకరాల భూమి ఇస్తానని చెప్పి దళితుణ్ణి భూ యజమానినీ చేస్తాననీ మోసం చేయడంతో వారు రైతు బంధు, రైతు భీమాను పొందలేకపోయారని ఇదేనా దళితులపట్ల చూపిస్తున్న ప్రేమ అని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడేంధుకు నిధుల కొరత లేదని చెప్పారు. బంగారు తెలంగాణ కాదు కేసీఆర్ దళితులు, అల్పసంఖ్యక వర్గాలు, బలహీన వర్గాలకు బతుకుదెరువు చూపెట్టే సామాజిక తెలంగాణ కావాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. సమావేశంలో జగిత్యాల మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కళ్ళెపెల్లి దుర్గయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మున్సిపల్ కౌన్సిలర్ నక్క జీవన్, కాంగ్రెస్ నాయకులు బండ శంకర్, గుంటి జగదీశ్వర్, గాజంగి నందయ్య, చందా రాధాకిషన్, ఆనందరెడ్డి, జున్ను రాజేందర్, నేహాల్, మహిపాల్, గుండా మధు, మున్నా, గంగాధర్ తదితరులున్నారు.