అధికారులతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్
వాతావరణ శాఖ జారీ చేసిన సూచనలు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పోలీస్ కమిషనర్లు మరియు నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్లతో బిఆర్కెఆర్ భవన్ నుండి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పూర్వ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
నీటి పారుదల, విద్యుత్ శాఖ అధికారులు జాగ్రత్తగా పరిస్థితులను ఎప్పటికప్పడు మానిటరింగ్ చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయి అధికారులు, ఉద్యోగులు హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలని స్పష్టం చేశారు. జిల్లాలలో నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవడానికి అధికారులందరితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్లో రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఫైర్ సర్వీసెస్ డిజి సంజయ్ కుమార్ జైన్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, జిహెచ్యంసి కమిషనర్ లోకేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.