- భారీగా పడిపోయిన విద్యుత్ వినియోగం
- బస్టాండ్లలో తప్పని పడిగాపులు…కిక్కిరిసిన బస్సులు
ప్రజాతంత్ర, హైదరాబాద్, జనవరి 14 : సంక్రాంతి సెలవుల సందర్భంగా నగరంలోని వలసజీవుల్లో చాలా మంది సొంతూళ్లకు వెళ్లడంతో రెండురోజులుగా నగరం బోసిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ వినియోగమూ తగ్గింది. అధికారులే ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. సాధారణ రోజుల్లో నిత్యం 55 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం ఉంటుంది. నాలుగైదు రోజులుగా విద్యుత్ వినియోగం 47 మిలియన్ యూనిట్లలోపే ఉంటుంది. ఇక..మెట్రో రైళ్లలోనూ ప్రయాణికుల రద్దీ రెండు రోజులుగా భారీగా తగ్గింది. నగర పరిధిలోని నాగోలు-రాయదుర్గం, జేబీఎస్-ఎంజీబీఎస్, ఎల్బీనగర్-మియాపూర్ మార్గాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 11.15 వరకు 66 స్టేషన్ల నుంచి రోజుకు 820 ట్రిలను నడిపిస్తున్నారు. ఈ మూడు కారిడార్ల పరిధిలో రోజుకు సగటున 2.50 నుంచి 2.70 లక్షల మంది ప్రయాణిస్తారు.
బుధ, గురువారాల్లో ఆ సంఖ్య 1.5 లక్షలకు తగ్గింది. అయితే.. పండుగకు ఊరెళ్లే వాహనాలన్నీ సాఫీ ప్రయాణం కోసం ఔటర్ రింగ్ రోడ్డును ఎంచుకుంటుండడంతో గత నాలుగైదు రోజులుగా ఓఆర్ఆర్పై మాత్రం వాహనాల సంఖ్య బాగా పెరిగింది. ఐదు రోజుల్లో పదిలక్షల వాహనాలు ఔటర్పై అదనంగా ప్రయాణం చేసినట్టు సమాచారం. సాధారణ రోజుల్లో రోజుకు 1.2 లక్షల వాహనాలు ప్రయాణిస్తాయి. కానీ, రెండు, మూడు రోజులుగా.. 2లక్షల నుంచి 3లక్షల మేర వాహనాలు అదనంగా వెళ్లాయని, శుక్రవారం ఆ సంఖ్య మరింత పెరిగిందని ఓ అధికారి తెలిపారు. ఇకపోతే నగర రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు కానరావడం లేదు. వాహనాల రొద బాగా తగ్గింది. సాధారణంగా నగర రోడ్లపై ప్రతి రోజూ సగటున 50 లక్షల వాహనాలు తిరుగుతుంటాయి. అయితే గురువారం వాటి సంఖ్య 25 లక్షలకు తగ్గిందని..శుక్ర, శనివారాల్లో 20 లక్షల లోపే ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ తగ్గిపోవడంతో వాహనదారులు వేగంగా గమ్య స్థానాలకు చేరుకోగలుగుతున్నారు. రాష్ట్ర రాజధాని నగరంలో.. రహదారులపై ట్రాఫిక్ తగ్గింది! ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వాహనాల మోతతో దద్దరిల్లే రహదారులు బోసిబోయి కనిపిస్తున్నాయి. లాక్డౌన్ పెట్టినట్టుగా.. పలు కాలనీలు నిర్మానుష్యంగా మారాయి.
రోడ్ల వెంట తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులు గిరాకీ కోసం పడిగాపులు కాసారు. నాలుగు రోజుల క్రితం వరకూ..ఐటీ కారిడార్లోని రోడ్లపై నిమిషానికి వేలాది వాహనాలు రాకపోకలు సాగించిన పరిస్థితి ఉండగా..పదుల సంఖ్యలోనే కనిపించాయి. నగరంలోని రహదారులపై రద్దీ తగ్గినా..రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లు మాత్రం కిటకిటలాడిపోతున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి 3.30 లక్షల మంది తరలివెళ్లినట్లు రైల్వేవర్గాలు తెలిపాయి. ఆర్టీసీ బస్సుల ద్వారా 1.80 లక్షల మంది ప్రయాణించినట్లు అధికారులు చెప్పారు. అటు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపైనా రద్దీ కొనసాగుతుంది. పంతంగి టోల్గేటు వద్ద విపరీతమైన వాహనాల రద్దీ నెలకొంది. దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటుచేసిన ప్రత్యేక రైళ్లలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. పండక్కి సొంతూరికి వెళ్లాలన్న నగరవాసుల కోరికను ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రైవేటు బస్సుల్లో చార్జీలను సాధారణ రోజుల్లో కంటే 40 నుంచి 50 శాతం మేర పెంచేయడంతో సామాన్య, మధ్య తరగతి ప్రయాణికుల జేబులు గుల్ల అయ్యాయి. ప్రత్యేక రైళ్లు, బస్సులు ఇప్పటికే నిండిపోవడంతో వేరేమార్గం లేక వాటిలో ప్రయాణిస్తున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు నాన్ ఏసీ బస్సులో టికెట్ ధర రూ.500 ఉండగా..ఇప్పుడు రూ.1000 వసూలు చేసారు. కాకినాడకు రూ.750 ఉంటే ఇప్పుడు రూ.1300 తీసుసుకుంటున్నారు.
బస్టాండ్లలో తప్పని పడిగాపులు… కిక్కిరిసిన బస్సులు
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లాలన్న ప్రజలకు బస్సులు దొరక్క నానాయాతన పడ్డారు. శుక్రవారం ఉదయం కూడా బస్సుల కోసం వేకువ జామునుంచే బస్టాండ్ల వద్దకు వొచ్చినా చేరాల్సిన గమ్యానికి బస్సులు దొరక్క ఇబ్బందులు పడ్డారు. తమ స్వగ్రామాలకు తరలివెళ్తున్న ప్రయాణికుల రాకతో జూబ్లీ బస్స్టేషన్, ఇమ్లిబన్, దిల్సుఖ్ నగర్, ఉప్పల్ బస్టాండ్ పరిసరాలు కిటకిట లాడాయి. నగరవాసులు కుటుంబ సమేతంగా పండుగకు తమ ఊళ్లకు వెళ్తుండడంతో సందడి వాతావరణం నెలకొంది. అధికారులు ముందుగా అనుకున్నట్లుగానే రద్దీకి అనుగుణంగా కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ సెక్టార్లలోని వివిధ ప్రాంతాలకు రోజువారి సర్వీసులతోపాటు అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ వైపు ప్రత్యేక బస్సులు నడిపారు. కర్నూలు రూట్లో కూడా…