Take a fresh look at your lifestyle.

ధరణి సృష్టి కర్త – స్కామ్‌ ‌స్టర్ ‌సోమేశ్‌ ‌కుమార్‌..!

  • సోమేశ్‌ ‌కుమార్‌ ‌ను చీఫ్‌ అడ్వైజర్‌ ‌గా తొలగించాలి
  • ప్రజలకు ఉపయోగపడే స్కీంలకు సలహాలు ఇవ్వాలే.. కానీ స్కాంలకు కాదని బ్యూరోక్రాట్స్ ‌కు హితవు
  • సెక్యూరిటీ లేకుండా ఓయూ, కేయూలకు వెళ్లే మ్ము కేటీఆర్‌, ‌తలసానికి ఉందా? సవాల్‌ ‌విసిరిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
  • ప్రియాంకను విమర్శించే అర్హత, జ్ఞానము తలసానికి లేదని 55వ రోజు పీపుల్స్ ‌మార్చ్ ‌పాదయాత్రలో  విమర్శ

ఉద్యోగ విరమణ చేసిన సోమేశ్‌ ‌కుమార్‌ ‌కి మళ్ళీ సీఎం కేసీఆర్‌ ‌చీఫ్‌ అడ్వైజర్‌ ‌పదవి ఇవ్వడం ఏమిటి..? ఇక్కడ ఆయనకున్న ఇంట్రెస్ట్ ఏం‌టి.?  ధరణి సృష్టి కర్త ..స్కామ్‌ ‌స్టార్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌ను తక్షణమే చీఫ్‌ అడ్వైజర్‌ ‌పదవి నుంచి తొలగించాలని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. భట్టి విక్రమార్క పీపుల్స్ ‌మార్చ్ ‌పాదయాత్ర 55వ రోజు  రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌ ‌పేట్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌, ‌జల్‌ ‌పల్లి మున్సిపాలిటీల పరిధిలో గల పలు ప్రాంతాల మీదుగా కొనసాగింది. అనంతరం మామిడిపల్లి ఎక్స్ ‌రోడ్‌ ‌పాదయాత్ర శిబిరం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క మాట్లాడారు.. పదవి విరమణ చేసిన సోమేశ్‌ ‌కుమార్‌ ‌ను సీఎం కేసీఆర్‌ ‌చీఫ్‌ అడ్వైజర్‌ ‌గా నియామకం చేస్తూ.. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను చూసి ఆశ్చర్యం వేసిందన్నారు. ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తికి మళ్ళీ పదవి ఏమిటి..? అంటూ షాక్‌ ‌కు గురయ్యానని అన్నారు.  ఐఏఎస్‌లు ఏ రాష్ట్రానికి కేటాయిస్తే గౌరవంగా ఆ రాష్ట్రానికి వెళ్లి పని చేసుకోవాలన్నారు. కానీ, సోమేష్‌ ‌కుమార్‌ ‌లాంటి వ్యక్తి ఏపీకి వెళ్లకుండా విఆర్‌ఎస్‌ ‌తీసుకొని సీఎం చీఫ్‌ అడ్వయిజర్‌గా పదవి పొందడంలో అంత ఇంట్రెస్ట్ ఏమున్నదని ప్రశ్నించారు.

కొలువుల కోసం కొట్లాడీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ అయిన ఉన్నతాధికారులను తిరిగి ఎందుకు నియమిస్తున్నారని సీఎం కేసీఆర్‌ ‌ను భట్టి ప్రశ్నించారు. రిటైర్డ్ అధికారులపై చాలా అపోహలు ఉన్నాయన్నారు. ధరణి తీసుకు వచ్చిన తర్వాత పార్ట్ ‌బి లో ఉన్న భూములను దిగమింగడానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, భూ బకాసురులకు సోమేశ్‌ ‌కుమార్‌ ‌లాంటి అధికారులు ఉపయోగపడుతున్నారని, అందుకనే రిటైర్డ్ అధికారులను అడ్వైజర్లుగా నియామకం చేసుకుంటున్నారని ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు. పేదలకు కాంగ్రెస్‌ ‌పార్టీ ఇచ్చిన భూములను ధరణి పేరుతో లాక్కున్నారని వివరించారు. జైపూర్‌ ‌మండలం బాండేడ్‌ ‌లేబర్‌ ‌కాలనీలోని రైతులకు వెట్టిచాకిరి విముక్తి నిమిత్తం ఇచ్చిన భూములను ధరణి వచ్చిన తర్వాత వెనక్కి గుంజుకున్నారని వెల్లడించారు. గత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్డ్ ‌భూములను ఈ బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం  లాక్కుని రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే 5లక్షల కోట్ల రూపాయల విలువైన భూములు లాక్కున్నారని, హైదరాబాద్‌ ‌చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో 25లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను లాక్కున్నారని తెలిపారు. బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ పెద్దలు  చేసే భూముల  దోపిడీలో సూత్రధారి, పాత్రధారిగా ఉన్న సోమేశ్‌ ‌కుమార్‌ ‌లాంటి వ్యక్తిని మళ్ళీ సలహాదారుగా నియమించుకోవడం అంటే, మిగిలి ఉన్న భూములను దోపిడీ చేయడానికేనా అని నిలదీశారు.

బ్యూరోక్రాట్స్ ‌ప్రజలకు ఉపయోగపడే స్కీములు తీసుకురావడానికి సలహాలు చెప్పాలి కానీ, పాలకులు స్కాములు చేసే పథకాలకు సలహాలు చెప్తే ఎలా అని అన్నారు. ధరణి సృష్టికర్త స్కాం స్టార్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌ ‌ప్రైవేట్‌ ‌వ్యక్తులకు క్లియర్‌ ‌చేసిన ప్రభుత్వ భూముల పై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు లేఖ రాస్తామని వెల్లడించారు. అవసరం అయితే రాష్ట్రపతిని కూడా కలుస్తామన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు ఎక్కడ ఉన్నా ఆ సమాచారం ప్రజలకు చేరవేయాలని విద్యార్థి, నిరుద్యోగ లోకానికి పిలుపునిచ్చారు.  రిటైర్డ్ అయిన వాళ్ళు గబ్బిలాల లెక్క పట్టుకుని వేలాడటం మంచిది కాదన్నారు. ఉద్యోగాలు లేని వాళ్ళను బతకనీయండి అని రిటైర్డ్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌వోట్లు  వేసి గెలిపించుకున్న ప్రజల కోసం కాకుండా బహుళ జాతి కంపెనీల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. హైద్రాబాద్‌ అభివృద్ధి చేయకపోగా ఓఆర్‌ఆర్‌ అమ్ముకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. సోమేశ్‌ ‌కుమార్‌, ‌ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌ ‌కుమార్‌ ‌లు  ఈ ప్రభుత్వ పెద్దలకు ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డును అమ్ముకునే  స్కిం ఇచ్చారని ఆరోపణలు గుప్పించారు.  ఓఆర్‌ఆర్‌ని ముపై ఏండ్లు అమ్మకానికి పెడితే ఎలా ? అందిన కాడికి అమ్ముకోవడమేనా అంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

అందిన కాడికి దోచుకోవడమే పనిగా బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పెట్టుకున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో నాలుగు నెలల్లో అధికారం పూర్తవుతున్న క్రమంలో 30 ఏళ్లకు లీజు ఇచ్చి ఒకేసారి మొత్తం పన్నును ఈ ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అంబానీ ఆదానిలాంటి కార్పొరేట్లకు 30 సంవత్సరాలకు లీజుకి ఇచ్చి వారిచ్చిన డబ్బులతో బడ్జెట్‌ ‌పెట్టుకొని నాలుగు నెలల్లో ఇంటికి వెళ్ళదని గ్యారెంటీ ఏమున్నదని ప్రశ్నించారు. ఎంత మందిని ప్రభుత్వ సలహాదారులుగా పెట్టుకుంటారని,  రిటైర్డ్ అధికారులతో ప్రభుత్వం నడపాలనుకుంటున్నారా? లక్షల కోట్లు ఖర్చు పెట్టే ఇరిగేషన్‌ ‌శాఖకు రిటైర్డ్ అయిన వ్యక్తిని ఎలా కొనసాగిస్తారని, పారదర్శకత, జవాబు జారితనం అక్కెర లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేము పేదలకు ఇచ్చిన భూములు అన్నీ మీవే? ఈ ప్రభుత్వానికి ఏ హక్కు లేదన్నారు. మీ భూమి దగ్గర మీరు ఉండండి, ఆ భూముల్లో అరకలు కట్టండి.. ఎవడు అడ్డు వచ్చినా ఆగకండి అంటూ సూచించారు. ఆరు నెలలు కాపాడుకోండి.. ఆరు నెలల తరవాత ఇందిరమ్మ రాజ్యం వస్తోందని భట్టి అన్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌ ‌లాక్కున్న భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. ఇంధిరా గాంధీ, ప్రియాంక గాంధీల గురించి మాట్లాడే అర్హత తలసానికి లేదన్నారు.

Leave a Reply