కాంట్రీబ్యూటరీ పెన్షన్స్కీంలో పనిచేస్తున్న ఉద్యోగులు పోరుబాట పట్టేందుకు సిద్ధమయ్యారు.తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగులకు (సీపీఎస్) పూర్తిస్థాయి వేతనాలు ఇస్తామని, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చనందున నిరసనగా మార్చి 1న మహాధర్నా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.ఈ పథకంలో రాష్ట్రంలో లక్షమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ అడుగుజాడల్లో ఉద్యమించారు. రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా సీఎం తమ గోడు పట్టించుకోవడం లేదని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్స్కీం ఉద్యోగులు గోడు వెళ్లబోసుకుంటున్నారు.సీపీఎస్ విధానంలో ఉద్యోగభద్రత ఉండదని, పెన్షన్ సైకర్యం ఉండదని ఈస్కీం ఉద్యోగుల కష్టాలు తమకు తెలుసునని సీఎం ఉద్యమనేతగా అనేక సభలలో మాట్లాడారు. సీపీఎస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే సీపీఎస్ ఉద్యోగులకు కష్టాలు ఉండదని, వారి కష్టాలు తీరుస్తానని సీఎం వాగ్దానం చేశారు. ఈ హామీలను దృష్టిలో పెట్టుకొని సీపీఎస్ ఉద్యోగులు పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలని,ఉద్యోగభద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా నిర్వహించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం పలు సందర్బాలలో సీపీఎస్ రద్దు పాతపెన్షన్ విధానం అమలు చేయడం వంటి అంశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవచ్చునని తెలియచేసింది. కేంద్రం అనుమతి తీసుకొని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి సీపీఎస్ రద్దుపై అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.కానీ ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించనేలేదు.ప్రతిపక్ష కాంగ్రెస్ శాసనసభ్యులు, ఎంఎల్సీలు రాష్ట్ర ముక్యమంత్రిని కలిసి విజ్ఞాపనలు అందజేశారు.గత ఆరేళ్లలో సీఎం మాత్రం ఇంతవరకు స్పందించలేదని సీపీఎస్ ఉద్యోగసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 50 సంవత్సరాల కాలంలో అనేక ఉద్యమాలకు సారథ్యం వహించిన టీఎన్జీవో సంఘం తమ సమస్యల విషయంలో తాత్సారం చేస్తున్నదని, తమ ఉద్యమాలకు నాయకత్వం వహించదం లేదని టీఎన్జీవో సంఘం పైన తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆగ్రహంగా ఉన్నది.సీపీఎస్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ సాధించేవరకు తమ సంఘం వారితో కలిసి ఉద్యమిస్తుందని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఈఏ) అధ్యక్షుడు సంపత్కుమారస్వామి పేర్కొన్నారు.సీపీఎస్ ఉద్యోగులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగసంఘాల నాయకులు ఈ మహాధర్నాలో పాల్గొననున్నారు.