ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రజాతంత్ర, హైదరాబాద్ : ఒకవైపు కొరోనా మరోసారి విజృంభణ..మరోవైపు కొత్త వేరియంట్ రూపంలో ఒమిక్రాన్ విరుచుకుపడుతున్న క్రమంలో కొరోనా ఆంక్షలను విధించిన రాష్ట్ర ప్రభుత్వం మరోమారు వాటిని పొడిగించింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా..నేటి నుంచి ఫీవర్ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించగా మరోవైపు..ప్రభుత్వం గతంలో విధించిన కొరోనా ఆంక్షలు ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో ఆంక్షలలను ఈ నెల 31 వరకు పొడిగించింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్రమంగా కోవిడ్ కేసుల పెరుగుతోన్న నేపథ్యంలో అలర్ట్ అయిన రాష్ట్ర ప్రభుత్వం.. సంక్రాంతి సెలవుల తర్వాత తిరిగి స్కూళ్లు, విద్యా సంస్థలు ప్రారంభం కావాల్సి ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 30వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో.. ప్రైవేట్ విద్యా సంస్థలు ఆన్లైన్లో తిరిగి బోధనను ప్రారంభించాయి.. ఇక, శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఫీవర్ సర్వే ప్రారంభం కాబోతుంది.. ఇప్పటికే టెస్ట్ కిట్లను, మెడికల్ కిట్లను ఆయా ప్రాంతాలకు అధికారులు చేరవేశారు.