ప్రజాతంత్ర, కరీంనగర్: రెండు రోజులు ఆలస్యంగా మున్సిపల్ సంగ్రామానికి కరీంనగర్ సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరీంనగర్ కార్పొరేషన్కు పోలింగ్ జరుగనుంది. ఇందుకుగానూ అధికారులు సర్వం సన్నద్ధం చేశారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లున్నాయి. వాటిలో రెండు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుపొందారు. 20వ డివిజన్లో తుల రాజేశ్వరి, 37వ డివిజన్లో చల్ల స్వరూపారాణి ఏకగ్రీవంగా విజయం సాధించారు. దీంతో మిగిలిన 58 స్థానాలకు శుక్రవారం ఎన్నిక జరుగనుంది. మొత్తం 371 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2 లక్షల 72వేల 195 మంది ప్రజలు వోటు వేయనున్నారు. వారి కోసం 348 పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచారు.
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నిక నిర్వహణకు
అన్ని ఏర్పాట్లు చేశామని జేసీ శ్యాం ప్రసాద్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ తో పాటు నలుగురు సిబ్బంది ఉంటారని చెప్పారు. ఎన్నికల విధుల్లో దాదాపు 2 వేల మంది పాల్గొంటున్నారని తెలిపారు. దొంగ ఓట్లు పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు.పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను ఎస్ఆర్ఆర్ కళాశాలలో భద్రపరుస్తారు. ఈ నెల 27వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి,అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు.