- మిడియా సమావేశంలో కేంద్రమంత్రి హర్షవర్ధన్ వెల్లడి
- 75మంది హాస్పిటల్ సిబ్బందికి కొరోనా
దేశంలో కొరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ అన్నారు. గడిచిన ఏడు రోజుల్లో దేశ వ్యాప్తంగా 80 జిల్లాల్లో ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. అలాగే 47 జిల్లాల్లో గత 14 రోజులుగా కొత్త కేసులు వెలుగుచూడలేదని, గత 21 రోజుల్లోనూ 39 జిల్లాలో కొరోనా కేసులు నమోదుకాలేదని వెల్లడించారు. ఇక గడిచిన 28 రోజుల్లో దేశ వ్యాప్తంగా 17 జిల్లాల్లో కేసులే వెల్లడికాలేదని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీలో జరిగిన మిడియా సమావేశంలో హర్షవర్థన్ వివరాలను వెల్లడించారు. వైరస్ కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకరంగా ఉందని, దీనిపై స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు సక్ష చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. కాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1543 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 29435కి చేరిందన్నారు. ఇప్పటివరకు 6,869 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 934 మంది మృతిచెందారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో 21,632 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు
75మంది హాస్పిటల్ సిబ్బందికి కొరోనా
ఢిల్లీలోని 75 మంది స్టాఫ్కు కొరోనా సోకింది. హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులకు కూడా పాజిటివ్గా తేలింది. ఒకే కుటుంబానికి చెందిన అనేక మంది కరోనా బారిన పడ్డారని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 3108కి చేరింది. నిన్న ఒక్కరోజే 190 కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకూ 877మంది కోలుకున్నారు. 11 మంది వెంటిలేటర్పై ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 54మంది చనిపోయారు. 13 రోజుల్లో కేసులు రెట్టింపు అవుతున్నాయని ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. మరోవైపు ఢిల్లీలో లాక్డౌన్కు సంబంధించి కొన్ని సడలింపులు ఇచ్చారు. ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు, పశు వైద్యులపై ఆంక్షలు తొలిగాయి. వైద్య ఆరోగ్య సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, శాస్త్రవేత్తల ప్రయాణాలపై ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆంక్షలు తొలగించింది. పుస్తకాలు, ఎలక్టాన్రిక్ ఉత్పత్తుల దుకాణాలు తెరుచుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుత సీజన్లో ఫ్యాన్ల అమ్మకాలు ఎక్కువగా జరగాల్సి ఉన్నా అతి తక్కువగా వినియోగదారులు వస్తున్నారని దుకాణాల యజమానులు తెలిపారు.