Take a fresh look at your lifestyle.

అక్టోబర్‌లో తీవ్రస్థాయికి కొరోనా

  • పెద్దల కంటే పిల్లలపై చాలా ప్రభావం
  • ప్రధానికి డిజాస్టర్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌నివేదిక
  • నీతి ఆయోగ్‌ ‌థర్డ్‌వేవ్‌ ‌హెచ్చరికలపైనా ప్రజల్లో ఆందోళన
  • తాజాగా 24 గంటల్లో 25,072 మందికి పాజిటివ్‌..389 ‌మంది మృతి
  • 1.03 శాతానికి తగ్గిన క్రియాశీల రేటు

అక్టోబర్‌ ‌నాటికి కొరోనా పీక్‌ ‌స్టేజ్‌కు చేరుతుందని, పెద్దల కంటే పిల్లలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌డిజాస్టర్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌కమిటీ హెచ్చరించింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయానికి నివేదిక అందించింది. డేంజర్‌ ‌జోన్‌లో ఉన్న చిన్నారులను రక్షించేందుకు చర్యలు చేపట్టాలని నివేదికలో సూచించింది. పిల్లలకు అవసరమైన చికిత్సలను, వైద్య సిబ్బందిని, వెంటిలేటర్లు, అంబులెన్స్‌లను సిద్దంగా ఉంచాలని సూచించింది. చిన్నారులు పెద్ద ఎత్తున కోవిడ్‌ ‌బారిన పడే సూచనలు ఉన్నట్లు హెచ్చరించింది. పిల్లలకు వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని సూచించింది. వీలైనంత త్వరగా పిల్లలకు టీకా అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్‌ ‌చేయడం వల్ల థర్డ్ ‌వేవ్‌ ఉధృతిని కొంత అరికట్టవచ్చునని సూచించింది. అలాగే చిన్నారుల్లో ఇన్‌ఫెక్షన్‌ ‌సోకితే ఇతరులకు వేగంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ఇదిలావుంటే నీతి ఆయోగ్‌ ‌కూడా థర్డ్‌వేవ్‌ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. హాస్పిటళ్లలో బెడ్లు, మందులు, ఆక్సిజన్‌ ‌సిద్ధం చేసుకోవాలని సూచించింది.

నీతి ఆయోగ్‌ ‌థర్డ్‌వేవ్‌ ‌హెచ్చరికలపైనా ఆందోళన
దేశంలో కొరోనా వైరస్‌ ఉద్ధృతి అదుపులో ఉందని తాజా పరిస్థితులు తెలియచేస్తున్నా నీతి ఆయోగ్‌ ‌తాజా హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొరోనా మహమ్మారి మరోమారు తన వికృతరూపం చూపనుందని నీతి ఆయోగ్‌ ‌తాజాగా థర్డ్ ‌వేవ్‌పై హెచ్చరికలు జారీ చేయడం ఆందోళన కలిగిస్తుంది. సెప్టెంబరులో ప్రతిరోజూ 4 నుంచి 5 లక్షల కొరోనా కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించింది. అప్పుడు కొరోనా బారిన పడిన ప్రతీ 100 మందిలో 23 మంది హాస్పిటల్‌లో చేరాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయని అంచనా వేసింది. అందుకే ఈ పరిస్థితులకు ముందుగానే దేశంలో రెండు లక్షల ఐసీయూ బెడ్లు సిద్ధంగా ఉంచాలని సూచించింది. మిడియాకు అందిన సమాచారం ప్రకారం…రానున్న కొరోనా దుర్భర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందుగానే అప్రమత్తమవుతూ, వైద్య సదుపాయాలు సిద్ధం చేయాలని సూచింది. 2 లక్షల ఐసీయూ బెడ్లతో పాటు 1.2 లక్షల వెంటిలేటర్‌ ‌కలిగిన ఐసీయూ బెడ్లు, 7 లక్షల ఆక్సిజన్‌ ‌సిలిండర్లు కలిగిన బెడ్లు, 10 లక్షల కోవిడ్‌ ఐసోలేషన్‌ ‌కేర్‌ ‌బెడ్లు సిద్ధం చేయాలని సూచించింది.

నీతి ఆయోగ్‌ ‌దీనికి ముందుగా 2020 సెప్టెంబరులో కొరోనా సెకెండ్‌ ‌వేవ్‌ ‌గురించి హెచ్చరించింది. ఈసారి కూడా థర్డ్ ‌వేవ్‌ ‌గురించి హెచ్చరికలు జారీ చేసింది. కాగా దేశంలో గడచిన 56 రోజులుగా 50 వేలకు దిగువగా రోజువారీ కొరోనా కేసులు నమోదవుతూ వొస్తున్నాయి. అయితే తాజాగా కొత్త కేసులు 19 శాతం మేర తగ్గి, 25 వేలకు చేరాయి. సుమారు ఐదు నెలల కనిష్ఠానికి చేరడమే కాకుండా క్రియాశీల రేటు, రికవరీ రేటు మెరుగ్గా ఉండటం ఊరటనిస్తుంది. సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ కొరోనా గణాంకాల ప్రకారం 24 గంటల వ్యవధిలో 25,072 మంది మహమ్మారి బారిన పడగా..389 మంది వైరస్‌ ‌కారణంగా మృత్యువాత చేరుకున్నారు. మొత్తం కేసులు 3.24కోట్లకు చేరాయి. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,34,756గా ఉంది. నిన్న 44,157 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.16 కోట్ల(97.63 శాతం)కు చేరాయి. కొద్దిరోజులుగా క్రియాశీల కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 3,33,924(1.03 శాతం) మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. మరోపక్క నిన్న కేవలం 7,95,543 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 58.25 కోట్లకు చేరింది.

Leave a Reply