- కొత్తగా 6026 కేసులు నమోదు
- మరో 52మంది మృత్యువాత
తెలంగాణలో కొరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కొరోనా బులెటిన్ ను విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 6026 కొరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కొరోనా కేసుల సంఖ్య 4,75,748 కి చేరింది. ఇందులో 3,96,042 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 77,127 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కొరోనాతో 52 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొరోనా మరణాల సంఖ్య 2579కి చేరింది. కొరోనా బులెటిన్ ప్రకారం నిన్న ఒక్కరోజు రాష్ట్రంలో 6551 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలావుంటే కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, అనాలోచిత నిర్ణయాల మూలంగానే దేశంలో కొరోనా కేసులు పెరుగుతున్నాయని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు కొరోనా వ్యాక్సిన్ సరఫరాకు, ఆక్సిజన్ కొరత తీర్చేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని వీరు కోరుతున్నారు.
కొరోనా బాధితులకు ఆక్సిజన్ను అందించలేని పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం చేరిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ను సరఫరా చేయకపోవడంతో ప్రాణవాయువును విమానంలో తెచ్చుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఐసీఎంఆర్ అనే సంస్థ ప్రభుత్వానికి సరైన సూచనలు, మార్గదర్శకాలను అందించకపోవడం కొరోనా ఉధృతికి కారణమన్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లను ఇతర దేశాలకు విక్రయించడంతో ఇక్కడ కొరత ఏర్పడిందన్నారు. కొవిడ్ బారినపడ్డ రోగులకు సరఫరా చేసే రెమ్డెసివి ర్ ఇంజక్షను కూడా కేంద్రం సరఫరా చేయడం లేదన్నారు. బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, ధర్మపురి అర్వింద్లు విమర్శలు మానాలని, వీరిద్దరు ఏనాడైనా తెలంగాణలోని కొరోనా పరిస్థితులపై అధ్యయనం చేశారా అని ప్రశ్నించారు. ఇంతటి కష్ట కాలంలోనూ ప్రజల బాధలను పట్టించు కోకుండా బీజేపీ ప్రభుత్వం క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ పెట్రోలు, డీజిల్, వంట గ్యాసు ధరలను అమాంతం పెంచి రూ. 5 వేల కోట్లను సమకూర్చుకుందని ఆరోపించారు.