- 24 గంటల్లో 43 కేసులు..
- మొత్తంగా 14 మరణాలు
- 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించిన మహమ్మారి
- 17 రాష్ట్రాలలో ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు
- మహారాష్ట్ర, కర్నాటక, కేరళల్లో పెరుగుతున్న బాధితులు
- 13కు చేరిన కరోనా మృతుల సంఖ్య
- ఢిల్లీలో డాక్టర్ కుటుంబానికి కరోనా
దేశావ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశంలోని 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వైరస్ పాకింది. దీని నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఇప్పటివరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 649 కి చేరిందని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ గురువారం వెల్లడించింది. కాగా దీని బారిన పడి ఇప్పటివరకు 13 మంది మరణించినట్లు తెలిపింది. ఇప్పటి వరకు అత్యధికంగా మహరాష్ట్రలో 124 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కేరళలో ఈ సంఖ్య 118 చేరింది. ఇక తెలంగాణలో ఇప్పటివరకు 44 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక గుజరాత్లో 38, రాజస్థాన్లో 38, ఉత్తరప్రదేశ్లో 38, ఢిల్లీలో 35, హర్యానాలో 31, పంజాబ్లో 31, తమిళనాడులో 26, మధ్యప్రదేశ్లో 21, లడఖ్లో 13, జమ్మూకశ్మీర్లో 11, ఏపీలో 10, బెంగాల్లో 10, చండీఘర్లో 7, ఉత్తరాఖండ్లో 5, బీహార్లో 4, ఛత్తీస్గఢ్లో 3, గోవాలో 3, హిమాచల్ప్రదేశ్లో 3, ఒడిశాలో 2, మణిపూర్, మిజోరాం, పుదుచ్చేరిలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి.
తాజాగా ఈశాన్య ఢిల్లీ మౌజ్పూర్లోని మొహల్లా క్లినిక్ విధులు నిర్వర్తిస్ను వైద్యునికి కరోనా సోకినట్టు అధికారులు వెల్లడించారు. వైద్యునితో పాటు అతని భార్య, కుమార్తెకు కూడా కరోనా పాజిటివ్గా తేలిందని, వారిని ప్రస్తుతం ఆస్పత్రిలో చేర్పించినట్టు తెలిపారు. అలాగే మార్చి 12 నుంచి 18 మధ్య కాలంలో డాక్టర్ను కలవడానికి ఆ క్లినిక్కు వెళ్లిన వారిని క్వారంటైన్లో ఉండాల్సిందిగా అధికారులు సూచించారు. ఒకవేళ కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రాదించాల్సిందిగా కోరారు. అయితే ఆ డాక్టర్ ఇటీవల ఏమైనా విదేశాలకు వెళ్లి వచ్చారా, లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా, ప్రాథమిక స్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందించడానికి ఢిల్లీ ప్రభుత్వం మొహల్లా పేరిట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఢిల్లీలో కొత్తగా 5 కరోనా కేసులు నమోదయ్యాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ తెలిపారు. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37కు చేరింది. తొలుత విదేశాల నుంచి వచ్చినవారే కరోనా బాధితుల జాబితాలో ఉండగా.. గత వారం రోజుల నుంచి కాంటాక్ట్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాల వారికి కరోనా సోకితే.. అది చాలా వినాశకర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.