- 24 గంటల్లో 96,982 పాజిటివ్ కేసులు
- ఢిల్లీలో 30 వరకు నైట్ కర్ఫ్యూ
- రాష్ట్రంలో కొత్తగా 1498 పాజిటివ్ కేసులు నమోదు
దేశం వ్యాప్తంగా కొరోని ఉధృతి కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా రోజు వారీ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. అయితే దేశవ్యాప్తంగా ఆదివారం లక్షకు పైగా కేసులు నమొదుకాగా సోమవారం 96,982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య మొత్త కోటి 26 లక్షల 86 వేల 49కి చేరాయి. ఒక్కరోజే 446 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 1,65,547 కి చేరింది. గత 24 గంటల్లో 50,143 మంది కొరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో కోటి 17లక్షల 32 వేల279 మంది కోలుకున్నారు..ఇంకా 7,88,223 మంది హాస్పిటళ్లలో చికిత్స తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా సోమవారం వరకు 8 కోట్ల 31లక్షల 10వేల 926మందికి టీకా వేశారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కొరోనా విజృంభిస్తున్నది.
ఈ నేపథ్యంలో కొరోనా నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. మహమ్మారి నియంత్రణకు తక్షణమే నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 30వ తేదీ వరకు.. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ కొనసాగనుంది. ఢిల్లీలో ఫోర్త్ వేవ్ కొనసాగుతున్నదని, లాక్డౌన్పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవ్రాల్ ఇటీవలే ప్రకటించారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించిన తర్వాతే లాక్డౌన్పై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఢిల్లీలో సోమవారం ఒక్కరోజే కొత్తగా 3,548 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్రంలో కొత్తగా 1498 పాజిటివ్ కేసులు నమోదు
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో సోమవారం కొత్తగా 1498 కొరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,14,735కి చేరింది. ఇందులో 3,03,013 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9993 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
ఒక్కరోజులో ఆరుగురు కొరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 1729కి చేరింది. 245 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.