“అందరి అభిప్రాయాలు సేకరించిన తరువాతనే మరో మార్గం లేదని గమనించి, 12వ తరగతి పరీక్షలను సకాలంలో రద్దు చేయడం జరిగిందని తెలుస్తున్నది. 12వ తరగతి చదువుతున్న లక్షలాది కౌమారదశ యువత పరీక్షల కోసం వేయి కళ్ళతో ఎదుచూడడం లేకుండా, తమ భవిష్యత్ ప్రణాళికలు మరియు కెరీర్ నిర్మాణాలపై దృష్టి పెట్టడానికి ఈ నిర్ణయం దోహదపడుతున్నది. పరీక్షల రద్దు ప్రభావం విద్యార్థుల విద్యాప్రమాణాలు, విద్యార్జనపై తప్పక పడుతుంది. ముఖ్యంగా మెరిట్ స్టూడెంట్స్ మనోబలం దెబ్బతీసేదిగా కూడా ఉండవచ్చు.”
కేంద్ర ప్రభుత్వం సిబియస్సి 12వ తరగతి పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో
నిబద్దతగల ప్రభుత్వాలు, ప్రధాన నాయకులు ఓ ముఖ్య నిర్ణయం తీసుకోవడానికి ముందు అనేక కోణాల్లో విశ్లేషించి, పలు రంగాల నిపుణుల సలహ సంప్రదింపులు జరిపారని చెప్పడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సిబియస్సి 12వ తరగతి వార్షిక పరీక్షల రద్దు నిర్ణయం నిదర్శనంగా నిలుస్తున్నది. ప్రభుత్వాలకు ప్రజారోగ్య భద్రత తరువాతనే ఏ ఇతర అంశమైన వస్తుంది. కోవిడ్-19 రెండవ అల సృష్టించిన సునామీకి లక్షల ప్రాణాలు, ముఖ్యంగా యువత, గాల్లో కలవడం మనందరం నిస్సహాయతగా చూశాం. 2వ అలలో కనిపించిన కొరోనా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడం, స్వల్పకాలంలోనే రోగుల ఆరోగ్య పరిస్థితి క్షీణించడం మన కళ్ళ ముందే జరిగి పోయాయి. ఈ విషమ ఘడియల్లో నేడు రద్దు చేసిన 12వ తరగతి పరీక్ష వల్ల యువతకు ఆరోగ్య భద్రత మాత్రమే అతి ముఖ్యమైన అంశమని గుర్తించబడింది. కరోనా సంక్షోభ సవాళ్ళ మధ్య ఒక వైపు యువత కెరీర్, మరో వైపు యువత సంపూర్ణ ఆరోగ్యం పరిగణలోకి తీసుకోబడింది. ప్రధాని మోదీ సహానుభూతితో తీసుకున్న ఈ ప్రధాన నిర్ణయం సముచితం మరియు హర్షణీయంగా తోస్తున్నది. ఇలాంటి పరీక్షల రద్దు 10/12వ తరగతి పరీక్షల రద్దు నిర్ణయాలను పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సకాలంలో తీసుకున్న విషయం మనందరికి గుర్తుంది.
నిజానికి 12వ తరగతి విద్యార్థి జీవితంలో అతి ముఖ్యమైన స్థితిగా, భవిష్యత్తును నిర్ణయించేదిగా, ఉజ్వల భవితకు (కెరీర్) ఊతం ఇచ్చేదిగా ఉంటుందని మనకు తెలుసు. ఇదే క్రమంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత కూడా అంతకన్న ప్రధానమైందని ప్రభుత్వాలు గమనించడం ముదావహం. 12వ తరగతి పరీక్షల రద్దుకు సంబంధమున్న కౌమార యువత, తల్లితండ్రులు, విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వాలు కోవిడ్-19 విషమ పరిస్థితులను అర్థం చేసుకొని, సహానుభూతితో పరిశీలించిన అనంతరమే ప్రకటన చేశారని విదితమవుతున్నది. మన ప్రధాని పలు సందర్భల్లో వారం వారం ‘మన్ కీ బాత్’ వేదికగా చేసుకొని విద్యార్థులను ఉద్దేశించి, వారికి పరీక్షల ప్రాధాన్యతలను వివరించడం, ధైర్య నూరిపోయడం, ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేయడం చూశాం. విద్యార్థి లోకానికి ఇంత ప్రాధాన్యతను ఇచ్చిన పూర్వ ప్రధానిని మనం చూడలేదనే చెప్పాలి.
12వ తరగతి పరీక్షల రద్దు విషయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం ప్రజా స్వామ్య పాలనగా తోస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాల విద్యా విభాగాలు, విద్యాధికారుల అబి •ప్రాయాలను పరిగణలోకి తీసుకున్న హై-పవర్డ్ కమిటీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో మంత్రులు ప్రకాశ్ జవదేకర్, స్మృతీ ఇరానీ సభ్యులుగా పలు రంగాల నిపుణులతో చర్చించి రద్దు నిర్ణయాన్ని ప్రధానికి తెలియజేయడం క్రమ పద్దతిలో జరిగిందని స్పష్టం అవుతున్నది. అందరి అభిప్రాయాలు సేకరించిన తరువాతనే మరో మార్గం లేదని గమనించి, 12వ తరగతి పరీక్షలను సకాలంలో రద్దు చేయడం జరిగిందని తెలుస్తున్నది. 12వ తరగతి చదువుతున్న లక్షలాది కౌమారదశ యువత పరీక్షల కోసం వేయి కళ్ళతో ఎదుచూడడం లేకుండా, తమ భవిష్యత్ ప్రణాళికలు మరియు కెరీర్ నిర్మాణాలపై దృష్టి పెట్టడానికి ఈ నిర్ణయం దోహదపడుతున్నది. పరీక్షల రద్దు ప్రభావం విద్యార్థుల విద్యాప్రమాణాలు, విద్యార్జనపై తప్పక పడుతుంది. ముఖ్యంగా మెరిట్ స్టూడెంట్స్ మనోబలం దెబ్బతీసేదిగా కూడా ఉండవచ్చు.
సకాలంలో పరీక్షలు పూర్తి చేసుకొని ఉన్నత విద్య కోసం ఎదురు చూడాలనుకునే వారికి ఈ నిర్ణయం కొంత ఊరటను మరియు కొంత ఆవేదనను మిగిల్చిందనడంలో సందేహం లేదు. ఉజ్వల భవిష్యత్తు కన్న సంపూర్ణ ఆరోగ్యమే మిన్న అని అర్థం చేసుకోవాలి. ఆన్ లైన్ తరగతుల కన్న తరగతి గది పాఠాలే విద్యార్థులపై సానుకూల ఫలితాలను ఇస్తాయని మనకు తెలుసు. కరోనా విధించిన క్రమశిక్షణకు తలొగ్గి, మన జీవనశైలిని మార్చకోక తప్పలేదు. ఆన్లైన్ క్లాస్లు, జూమ్ మీటింగులు, ఆన్లైన్ ఇంటర్వ్యూలు లాంటి ‘చేంజ్ మేనేజ్మెంట్’ను మనం తొందరగానే నేర్చుకోగలిగాం. సరైన పద్దతిలో గుణాత్మక పరీక్షలు, మూల్యాంకనం జరిగితేనే విద్యార్థులకు తమ విద్యా ప్రమాణాల స్థాయి తెలుస్తుందని, దానిని ఆధారంగా చేసుకొని తమ కెరీర్ను నిర్ణయించుకునే అవకాశం ఉంటుందని తెలుసు.
ఇలాంటి విపత్కర విపత్తు పరిస్థితులను అర్థం చేసుకొని విద్యార్థులు, తల్లితండ్రులు, కుటుంబాలు, సమాజం సరైన పద్దతిలో సకాలంలో తగు నిర్ణయాలు తీసుకుంటూ, రేపటి పౌరులను సన్మార్గంలో పెట్టవలసిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని గమనించాలి. పరీక్షల రద్దు విద్యార్థులను మానసికంగా కృంగదీయరాదు. జ్ఞాన సమపార్జనకు మహమ్మారులు అడ్డు కాదని, అన్ని అవాంతరాలను అధిగమిస్తూ, భారత్కే కాకుండా విశ్వానికే జ్ఞానబోధ చేసే రేపటి అత్యంత ప్రతిభగల భారత పౌరులుగా మన పాఠశాల పిల్లలు, కౌమారదశ యువతను ప్రోత్సహిస్తూ, బంగారు భవిష్యత్తు ఉండాలని దీవిద్దాం.

విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల
కరీంనగరం – 9949700037