మెటుపల్లి, ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర జనవరి5 : బిజెపి నేతలు కుట్రలు, కుతంత్రాలు, మత కలహాలు సృష్టిస్తూ ప్రజల మధ్య వైరుధ్యాలను సృష్టిస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల బతుకు దెరువు కోసం ఆరాట పడుతూ తెలంగాణ ప్రజల పేగు బంధంగా ఉందని అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రంతో పాటు హాజీపూరలో బస్తీ దవాఖానాను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కలెక్టర్ రవి, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతలతో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం చేసిందేమి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సారథ్యంలో పేదల కోసం అనేక సంక్షేమ
పథకాలు ప్రవేశ పెట్టామన్నారు.
పథకాలు ప్రవేశ పెట్టామన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ కుల్లు కుతంత్రాలు చేస్తుందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తుండటంతో నిరుద్యోగ యువత సంతోష పడుతున్నారని తెలిపారు. కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓర్వలేక రాజకీయ లబ్ధి కోసం ఇన్ని నోటిఫికేషన్లు ఎలా ఇస్తారని విమర్శలు చేయడం తగదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక వైద్య ఆరోగ్య శాఖ ముఖ చిత్రం మారిందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు తెలంగాణలో మూడే డయాలసిస్ సెంటర్లు ఉండేవని, ఇప్పుడు వాటిరి 122 చేశామన్నారు. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ఒక డయాలసిస్ సెంటర్ తెచ్చామని తెలిపారు. తెలంగాణలో 200 ఉన్న ఐసీయూ బెడ్లను 6వేలకు పెంచామన్నారు. గత ప్రభుత్వాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇప్పటి వరకూ ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను తీసుకరాలేదని, కాని తమ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు ప్రభుత్వ మెడికల్ కళాశాలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
మరో రెండు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పని చేస్తాయని తెలిపారు. రాష్ట్రంలో 950 మంది డాక్టర్లను కొత్తగా నియమించామని స్పష్టం చేశారు.ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే 90 మంది డాక్టర్లను నియమించామన్నారు. జిల్లా కేంద్రానికి ఒక మెడికల్ కళాశాల తెచ్చి, వైద్య విద్యను పేద విద్యార్ధులకు అందుబాటులో ఉంచామన్నారు. సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, నిధులను పెంచి పేదలకు ఆరోగ్య సేవలను చేరువ చేశారన్నారు. హెల్త్ సెక్టార్లో తెలంగాణ బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్టేట్ అని కేంద్ర ప్రభుత్వమే తేల్చిందని వెల్లడించారు. దేశంలో కేంద్ర ప్రభుత్వ హయాంలో 6 శాతం ఉన్న నిరుద్యోగితను 8.3 శాతానికి పెరిగిందని, తెలంగాణలో 4.1 మాత్రమే నిరుద్యోగిత రేటు ఉందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్తో సాగుకు ప్రభుత్వం సమృద్ధిగా జలాలు అందిస్తుందని, గుర్తు చేశారు. సాగు, తాగు నీరుతో ప్రజలకు, రైతులకు సమృద్ధిగా జలాలు అందుతున్నాయన్నారు. తెలంగాణ వచ్చిన నాటి నుండి 1 లక్షా 42 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు ఇచ్చమని కొత్తగా 81 వేల నోటిఫికేషన్ లు ఇస్తున్నామని తెలంగాణా లో రిక్రూట్ మెంట్ ల జాతర జరుగుతుందని అన్నారు.
వైద్య ఆరోగ్య శాఖలో 950 మంది డాక్టర్లను నియమించమని, కాళేశ్వరం ప్రాజెక్ట్ తో సాగుకు ప్రభుత్వం సమృద్దిగా జలాలు అందిస్తుందని సాగు, త్రాగు జలాలకు గోస లేదని అన్నారు.వరద కాలువ ను రిజర్వాయర్ గా మార్చిన ఘనత సిఎం కేసిఆర్ దేనని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు 68 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే..ప్రస్తుతం 2 కోట్ల 48 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతున్నాయని,తెలంగాణ దండుగ, ఉచిత కరెంట్ సాధ్యం కాదు అన్నోల్లు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో నే మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తామని తమ స్వంత జాగాలో ఇండ్లను మంజూరు చేసే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వినోద్ కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్, వైస్ చైర్మన్ గడ్డమిది పవన్, జడ్పీటీసీ దారిశెట్టి లావణ్య రాజేష్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు చీటి వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం
ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు
పోలీసుల ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది
సిద్ధిపేటలో పోలీస్-ఆరోగ్య రక్ష ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్రావు
ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు
పోలీసుల ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది
సిద్ధిపేటలో పోలీస్-ఆరోగ్య రక్ష ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 5: ఆరోగ్యమే మహాభాగ్యమనీ, ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. గురువారం సిద్ధిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లా పోలీస్ సిబ్బందికి సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాల వారి ఆధ్వర్యంలో పోలీస్- ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. పోలీసుల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా రాత్రింబవళ్లు, పండుగ పబ్బం లేకుండా నిరంతరం శ్రమించే డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు అని కొనియాడారు. ప్రజల ధన మాన ప్రాణ రక్షణలో పోలీసులు నిరంతరం శ్రమిస్తూ వారి ఆరోగ్యం, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు. వయస్సులో ఉన్నప్పుడు తెలియదు. కానీ, వయస్సుపై పడిన అనంతరం ఆ వ్యాధి భాధలు తెలుస్తాయని, అందుకే ముందు జాగ్రత్త చర్యగా రక్షక భటులకు ఆరోగ్య రక్ష కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి హరీష్రావు చెప్పారు.
తమ ఆరోగ్యం లెక్క చేయకుండా ప్రజల కోసం పని చేసే సంఘం పోలీసు సంఘమని, దరఖాస్తులు రాని సంఘం పోలీసుల సంఘమని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్యాన్ని మనం గమనించక పోవడం, కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చిన్న వయస్సులోనే బీపీ, షుగర్ లాంటి వ్యాధులు రావడం, దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఆర్గాన్స్ కిడ్నీ, లివర్, గుండె దెబ్బతిని జీవితంలో చాలా బాధపడుతూ ఉంటామని ఆరోగ్య జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమం రెండు ఏళ్లు మూడు దశల్లో చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కొంత ఇంకా నమ్మకాన్ని పెంచాలని ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దని, మీ ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. మీరు పూర్తి ఆరోగ్యంగా ఉండడానికి కొంత ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఈ జాగ్రత్త అవసరమని, ఈ హెల్త్ ప్రొఫైల్ రిపోర్ట్ లు ఇచ్చే సమయంలో వారి జీవిత బాగస్వామిని ఇద్దరిని కూర్చోబెట్టి చిన్న కౌన్సెలింగ్ ఇచ్చి ఇవ్వండని మంత్రి తెలిపారు.
ఆరోగ్యం పట్ల ఎవరికి ఓవర్ కాన్ఫరెన్స్ ఉండవద్దని తెలిపారు టెస్టులు ఎక్కువ చేయించుకుని మందులు తక్కువ వాడుకోవాలని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి మూడు ఆరు నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరు టెస్టులు చేయించుకోవాలని సూచించారు. డాక్టర్ సలహాలు, సూచనలు తప్పకుండా అందరూ పాటించాలని తెలిపారు. సమయం దొరికినప్పుడల్లా యోగా, వాకింగ్, రన్నింగ్ చేస్తూ ఉండాలని సూచించారు. మనం, మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. సరైన సమయానికి భోజనం తీసుకోవాలనీ, కుటుంబం కూడా మనలో ఒక భాగమని కుటుంబం, మన జీవనశైలి మార్చుకోవాలని సూచించారు. రక్షక భటులకు ఆరోగ్య రక్ష కార్యక్రమానికి రూ.15 లక్షల బడ్జెట్ కేటాయించామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ.. అన్నీ రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని, పాటించాల్సిన జాగ్రత్తలు, తీసువాల్సిన అవసరం గురించి వైద్యులు చెబుతారని, ప్రతి మూడు, ఆరు నెలలకు ఒకమారు పరీక్షలు చేయించి కాపాడే ప్రయత్నం చేస్తామని ఫ్యామిలీ కౌన్సెలింగ్ చేయాల్సిన అవసరం ఉందని, చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని మంత్రి తెలిపారు. సిద్దిపేట జిల్లా పోలీసులు రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలని సూచించారు.
నిర్వహించే టెస్టుల ద్వారా ఒక్కొక్కరి ప్రొఫైల్ తయారుచేసి మూడు భాగాలు చేయడం జరుగుతుంది. కన్వెన్షన్ సెంటర్ ద్వారా వచ్చే డబ్బులను కూడా పోలీస్ సంక్షేమం కోసమే వినియోగిస్తున్నామని, సంక్షేమ నిధి నుండి సహాయ సహకారాలు అందించే ప్రయత్నంలో భాగంగా.. పోలీస్ వారి అందరికీ పోలీస్ కన్వెన్షన్ సెంటర్ పూర్తి ఉచితంగా ఇస్తున్నామని, పోలీస్ కన్వెన్షన్ సెంటర్ మీ పోలీసు భద్రత ఆదాయం కోసం వాడడం జరుగుతుందన్నారు. పోలీస్ సిబ్బంది కోసం ఒక పోలీస్ నిధిని ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. ఎవరు కూడా ఈ రక్షక భటులకు ఆరోగ్య రక్ష కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహించోద్దని మీరంతా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇటీవల హైదరాబాదులో కొంతమంది యువకులను ర్యాండంగా పరీక్షలు జరిపితే అందులో విస్తుపోయే విషయాలు బయట పడ్డాయనీ, ప్రతీ వంద మందిలో 20 మంది బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతున్నట్లు తేలిందని వివరించారు. ప్రత్యేకించి ఆహారపు అలవాట్లు నిత్యం మారుతున్న జీవనశైలి అలవాట్లుతో నాన్ వెజ్ ఎక్కువగా తీసుకునే రాష్ట్రం తెలంగాణ అని, అతి తక్కువ రాజస్థాన్ రాష్ట్రమని దీనివల్ల ఆరోగ్యం సమస్యలు వస్తున్నవని తేలిందని మంత్రి చెప్పారు. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలని మీ కోసం మీ పిల్లలు కుటుంబం తల్లితండ్రులు ఎదురు చూస్తున్నారనే విషయం మరువొద్దని సూచించారు.
ఎప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలియని పరిస్థితి పోలీసులది. దీనితో అనేక సమస్యలు భవిష్యత్లో సంక్రమించే అవకాశం ఉందని, ఆరోగ్య భద్రత ఉన్నప్పటికీ అనారోగ్యం బారిన పడకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. మెడికల్ డైరెక్టర్ విమలా థామస్ హెల్త్ ప్రొపై ల్ తయారు చేసి అందుకు అనుగుణంగా మెడిసిన్ ఇవ్వబోతున్నారని, ప్రతి యేడు ఈ వైద్య పరీక్షలు చేస్తూనే వారిని వ్యాధుల నుండి రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.పోలీసు ఆరోగ్య రక్ష కార్యక్రమం త్వరలోనే మెదక్, సంగారెడ్డి జిల్లాలో ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, మునిసిపల్ ఛైర్పర్సన్ మంజుల రాజనర్సు, పోలీస్ కమిషనర్ నేరెళ్లపల్లి శ్వేతారెడ్డి, బిఆర్ఎస్ నాయకులు రాజనర్సు, మచ్చ వేణుగోపాల్రెడ్డి, పాల సాయిరాం, జంగిటి కనకరాజు, తాడూరి సాయి ఈశ్వర్గౌడ్, పి.సత్తయ్య, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.