పరువు నష్టం కేసులో పిటిషన్ డిస్మిస్
సూరత్, ఏప్రిల్ 20 : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. పరువు నష్టం కేసులో ఆయనకు చుక్కెదురైంది. రాహుల్ వేసిన పిటిషన్ను సూరత్ సెషన్స్ కోర్టు డిస్మిస్ చేసింది. మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యలపై సూరత్ కోర్టు ఇటీవల రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలంటూ రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం రోజున విచారణ జరగగా రాహుల్ పిటిషన్ను తోసిపుచ్చింది. ఈ కేసులో రాహుల్కు రెండేళ్ల పాటు జైలుశిక్ష పడటంతో ఎంపీ పదవిపై అనర్హత వేటుపడింది. గుజరాత్ హైకోర్టులో ఇదే కేసులో రాహుల్ పిటిషన్ వేయనున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నాటకలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మోడీ ఇంటిపేరుతో వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలను తప్పు పడుతూ గుజరాత్కు చెందిన బీజేపీ నేత పూర్ణేశ్ మోదీ కోర్టులో కేసు దాఖలు చేశారు.
క్రింది కోర్టు తీర్పును నిలుపుదల చేయాలని, సస్పెండ్ చేయాలని ఆయన చేసిన వినతిని సెషన్స్ కోర్టు అంగీకరించలేదు. ఆయన అపీలుపై ఇరు పక్షాల వాదనలను ఏప్రిల్ 13న కోర్టు స్వీకరించింది. అనంతరం తీర్పును రిజర్వు చేసింది. ఈ తీర్పు గురువారం వెలువడింది. రాహుల్ గాంధీ 2019లో కర్ణాటకలోని కోలార్లో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ, దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందని ప్రశ్నించారు. దీనిపై గుజరాత్కు చెందిన పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో రాహుల్ గాంధీ దోషి అని కోర్టు తీర్పు చెప్పింది. ఆయనకు రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన లోక్సభ సభ్యత్వం రద్దయింది. ఇది కక్షపూరిత చర్య అని కాంగ్రెస్, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సెషన్స్ కోర్టు రాహుల్ గాంధీ అపీలును అనుమతించినట్లయితే, ఆయనకు విధించిన శిక్ష, దోషిత్వ తీర్పును సస్పెండ్ చేసి ఉంటే, ఆయన లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణ జరిగి ఉండేది.