జోగులాంబ గద్వాల, ప్రజాతంత్ర, జూన్ 23 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సఖీ, షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించిందని అదనపు డీజీపీ, ఉమెన్ సెప్టీ విభాగం అధికారి స్వాతి లక్రా అన్నారు. మానసిక, శారీరక వేధింపులకు గురయ్యే వారికి భరోసా కేంద్రం తక్షణ సహాయం అందిస్తుందని స్వాతి లక్రా పేర్కొన్నారు. మహిళల జోలికోస్తే ఎంతిటి వారినైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. గద్వాల జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రం, స్త్రీ బాలల సహాయ కేంద్రాన్ని స్వాతి లక్రా గురువారం ఉదయం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, గద్వాల జిల్లా జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య, జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ..భరోసా కేంద్రాలతో బాధిత మహిళలకు తక్షణ సాయం అందుతుందని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళ రక్షణ కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. చట్టాలపై మహిళలకు అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఎవరైనా మహిళల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వేధింపులు ఎదుర్కుంటున్న బాధిత మహిళలకు అండగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోక్సో, లైంగిక దాడి కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు భరోసా కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.