- మెదక్ ఎంపి కేపీఆర్కు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు సవాల్
- రైతు రుణమాఫీ, ధరణి భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్
- సిద్ధిపేట కలెక్టరేట్ వద్ద బిజెపి రైతు ధర్నా
సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 : సిద్ధిపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్రెడ్డి(కేపీఆర్)కి బిజెపి పార్టీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్రావు తన దైనశైలిలో సవాల్ విసిరాడు. దమ్ముంటే దుబ్బాకకు రా..తేల్చుకుందాం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, నాది కాదూ…బిజెపి పార్టీకి చెందిన కార్యకర్త వెంట్రుకను కూడా మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్రెడ్డి పీకలేవంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. రైతు రుణమాఫీ, ధరణి భూ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా బిజెపి సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సిద్ధిపేటలోని కలెక్టరేట్ వద్ద రైతు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఎమ్మెల్యే రఘునందన్రావు మాట్లాడుతూ..ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి అవలంభిస్తున్న తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఎంపికి దుబ్బాక మీద ప్రేమ ఉంటే ఏం అభివృద్ధి చేసిండో చెప్పాలని డిమాండ్ చేశారు.
దమ్ముంటే ప్రభాకర్ రెడ్డి ఎంపి పదవికి రాజీనామా చేసి ఆమోదించుకోవాలని అప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం అని సవాల్ విసిరారు. ప్రభాకర్రెడ్డికి యూరియా అంటే తెలువదు., యూరియా ధర తెల్వదని ఎద్దేవా చేశారు. కేపీఆర్కు ఏమాత్రం దమ్మున్నా ఈ నెల 30న దుబ్బాకకు రా… తేల్చుకుందాం అని సవాల్ విసిరారు. మెదక్ ఎంపికి రాజీనామ చేస్తే గీత గీసి ఒడిస్తమనీ రఘునందన్రావు ఛాలెంజ్ చేశారు. ప్రధానమంత్రి మోదీది కాదు రఘునందన్రావుది కాదు కదా బిజెపి కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేడన్నారు. సెస్ ఎన్నికలు జరగడానికి నేను కోర్టులో కేసు వేయడం వల్లనే జరిగాయని రఘునందన్ రావు స్పష్టం చేశారు. దొడ్డిదారిలో దొంగ వోట్లతో సెస్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూసి బిఆర్ఎస్ విజయంగా కేటీఆర్ చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు.
గత ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన రుణమాఫీ హామీని వెంటనే అమలు చేసి ధరణి భూ సమస్యలను పరిష్కరించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం రైతు ఏడ్చిన రాష్ట్రం బాగుపడదని కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో అన్న మాటలు గుర్తు చేస్తూ..తెలంగాణ వచ్చిన తర్వాతనే రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల మాగాణి చేస్తానని అన్నారని అది అయిందో లేదో కానీ ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోటి మంది తాగుబోతుల వీణగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో 8వేల కోట్ల ఎక్సైజ్ అదాయం నుండి 42వేల కోట్ల ఆదాయానికి ఎక్సైజ్ పెరిగిందన్నారు. రాష్ట్రంలోని ఏ గ్రామంలో ప్రస్తుతం 24 గంటల కరెంట్ రావడం లేదని కేసీఆర్ మాటలు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉందని పెదవి విరిచారు.
కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి చేతలు తంగెల్లు దాటుతున్నాయన్నారు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఐఎఎస్, ఐపిఎస్లకు ఇక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా బిహార్ వాళ్లకు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చినా దళితుల ఆర్థిక స్థితిగతులలో మార్పు రాలేదని ఆవేదన చెందారు. కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో అధికారికంగా నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ ప్రకారం 8వేల మంది రైతులు మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి కింద ప్రతి పేద రైతుకి ఎకరానికి 6 వేల రూపాయలు ఇస్తుందన్నారు. ప్రధానమంత్రి రైతుల వ్యవసాయ కోసం 6338 కోట్లతో రామగుండంలో యూరియా కర్మాగారాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు.
కేంద్రం నుండి వచ్చే సబ్సిడీ పథకాలను దారి మళ్లించి రైతుబీమాగా మార్చారన్నారు. బిఆర్ఎస్ నాయకులకు చిత్త శుద్ది ఉంటే ధరణి సమస్యలు పరిష్కరించాలని చీఫ్ సెక్రటరీ కార్యాలయం ఎదుట ధర్నా చేయాలని హితువు పలికారు. ఈ ధర్నాలో బిజెపి సీనియర్ నాయకులు యెల్లు రాంరెడ్డి, గురువారెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబటి బాలేషంగౌడ్, నలగమ శ్రీనివాస్, బూరుగు సురేష్ గౌడ్, కోడూరి నరేష్, పత్రి శ్రీనివాస్ యాదవ్, కరివేద మహిపాల్ రెడ్డి,గోనె మార్కండేయులు ఉపేందర్, తిరుపతిరావు, యాదమల్లు, రాజు, విభీషణ్రెడ్డితో పాటు జిల్లా నలుమూలల నుండి వచ్చిన బిజెపి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.