పోరాట యోధుడు కోసూరి అమర్నాథ్
ఆయన ఒక పోరాట యోధుడు. కార్మిక ఉద్యమ కారుడు.సీనియర్ పాత్రికేయుడు. సీనియర్ వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమనేత, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు.రాజ్యాంగం, కోర్టులు, చట్టసభలు, రాజకీయ ఘటనలు, సినిమాలు, ట్రేడ్ యూనియన్ ఉద్యమం వంటి అంశాలలో ఆయన ఒక విజ్ఞాన సర్వస్వం.పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాముడూరు గ్రామంలో రైతు కుటుంబంలో కోసూరి సీతారామరాజు, సుభద్రమ్మ దంపతులకు 1952 సెప్టెంబర్ 15 న అమర్నాథ్ జన్మించారు. అమర్నాథ్ ప్రాథమిక విద్యాభ్యాసం మాముడూరులో, ఎస్. ఎస్.ఎల్.సి. పొలమూరు హైస్కూల్ లో జరిగింది. భీమవరంలో పియుసి పూర్తి చేశారు.
అమర్నాథ్ చిన్నతనంలోనే ఇంగ్లీష్ భాషలో గట్టి పట్టు సాధించారు.
ఆయన సోదరులు ఆర్టీసీలో, రైల్వేలో ఉద్యోగాలు చేస్తూ ఏ.ఐ.టి.యు.సి. అనుబంధ కార్మిక సంఘాలలో క్రియాశీల నేతలుగా పని చేయగా, వారి ప్రభావంతో అమర్నాథ్ బాల్యంలోనే వామపక్ష భావ జాలంతో మమేకం అయినారు. బాల్యం నుండే బ్లిట్జ్ పత్రికను క్రమం తప్పకుండా చదివే అలవాటు చేసుకుని, ఆ పత్రికలో ‘‘వక్స్ పాపులీ’’ కాలమ్ కు ఆరోజుల్లోనే రాస్తుండేవారు.ఇంగ్లీష్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఆయన 1972 ప్రాంతంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఎంపికయ్యారు.పదేళ్లపాటు న్యూఢిల్లీలో యు.పి. ఎస్.సి. కేంద్రకార్యాలయం లో ఉద్యోగం చేశారు. ఆయనకు భారత కమ్యూనిస్టుపార్టీ జాతీయ అగ్ర నేతలతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి.సి.పి.ఐ. కేంద్రకా ర్యాలయం అజయ్ భవన్ తోనూ,ఏ.ఐ.టి.యు.సి. కేంద్రంతోనూ సంబంధాలు ఉండటంతో ఆయ నకు కార్మికోద్యమంతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. కాని ఆరోగ్య కారణాలతో ఆయన ఉద్యోగాన్ని విడిచి ఆంధ్ర ప్రదేశ్ కు తిరిగి వచ్చారు.
1984 లో హైదరాబాద్ లో ఆంధ్ర భూమి లో సబ్ ఎడిటర్గా చేరారు.విశాఖపట్టణం, రాజమండ్రి, విజయవాడ కేంద్రాల్లో చీఫ్ సబ్ ఎడిటర్ గా, న్యూస్ ఎడిటర్గా పనిచేశారు.హైదరాబాద్ లోనే 2010 ప్రాంతంలో న్యూస్ ఎడిటర్గా పదవీ విరమణ చేశారు. తర్వాత ఎన్.ఎస్.ఎస్.వార్తా సంస్థకు కొంతకాలం పనిచేశారు.కొన్నాళ్ళు ప్రజాతంత్ర వార పత్రికకు కూడా వ్యాసాలురాశారు.
ఏ.పి.యు.డబ్ల్యు.జే. రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్రఅధ్యక్షునిగా సేవలు అందించారు. ఐ.జే.యు.జాతీయ కార్యవర్గ సభ్యునిగా, జాతీయకార్యదర్శిగా పని చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ పాలక మండలి సభ్యునిగా రెండుసార్లు నియమితులు కాగా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు రెండుసార్లు సభ్యునిగా ఎన్నికయ్యారు. పాత్రికేయులపై దాడులు – వారి భద్రత కు సంబంధించి ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటుచే సిన సబ్ కమిటీకి చైర్మన్ గా పలు చోట్లకు వెళ్ళి, నివేదికలు సమర్పించారు.
పాత్రికేయుల పై దాడులు జరిగినా, పత్రికాస్వే చ్ఛకు భంగంవాటిల్లినదని భావించినా పిలవని పేరంటమైనా, వెంటనే స్పందించిన కార్యశీలిగా గుర్తింపు పొందారు. ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదులు చేసి వాటిపై చర్యలు తీసుకోవాలని పెద్ద పోరాటం సాగించేవారు. కొన్నేళ్లుగా అధిక టీవీ న్యూస్చానెళ్లలో అనుభవం గల విశ్లేషకునిగా పాల్గొన్నారు.ఐ.జే.యు.ప్రచురిస్తున్న ‘‘స్క్రైబ్స్ న్యూస్’’ ఆంగ్ల మాసపత్రిక సంపాదకునిగా పని చేశారు.గత పాతికేళ్ళుగా విరామం లేకుండా ఏ.పి.యు.డబ్ల్యు.జే, ఐ.జే.యు, సంబంధించి నివేదికలు, పత్రాలు, తీర్మానాలు, వేజ్ బోర్డుకు వినతి పత్రాలు తయారు చేయడంలో అమర్నాథ్ ఆయన కీలకపాత్ర పోషించారు.ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లివచ్చిన అమర్నాథ్ కరోనా బారినపడి, నిమ్స్ ఆసుపత్రి లో చేరి గత సంవత్సరం ఏప్రిల్ 29న ఈ లోకాన్ని వదిలి వెళ్లారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494