అడ్వకేట్ దంపతుల హత్య కేసుతో టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. అలాగే ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖ నిస్పక్షపాతంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంలో కూడా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయలేదు.
గత శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు డీజీపీకి కూడా ఫోన్ చేయలేదు. ప్రజాక్షేత్రంలో నిబద్దతగా ఉంటున్నాం. అడ్వకేట్ దంపతుల హత్య దురదృష్టకరం. ఈగటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హత్య కేసులో ఎవరున్నా సరే వదిలిపెట్టం. ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేశారని అన్నారు. తమ పార్టీకి చెందిన వారున్నా వదిలిపెట్టలేదన్నారు. కుంట శ్రీనివాస్, చిరంజీవి, అక్కప్ప కుమార్, శ్రీనివాస్, బడారి లచ్చయ్య, వెల్ది వసంతరావును పోలీసులు అరెస్టు చేశారు.
న్యాయవాది దంపతుల హత్య కేసులో మాకు, మా పార్టీకి అసలు ప్రమేయం లేదు. హత్య కేసులో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నాడు. ఆ విషయం తెలిసిన మరుక్షణమే పార్టీ నుంచి తొలగించాం. అతన్ని అరెస్టు కూడా చేశారు. వారు కూడా జైల్లో ఉన్నారు. ఈ కేసు విషయంలో కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదన్నారు. ఈ కేసు విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ స్పష్టం చేశారు.