అమరావతి,మే 7: విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సక్షలో భాగంగా డీజీపీ గౌతమ్ సవాంగ్, విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్చంద్తో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలు, ఇతర అంశాలపై సీఎం వైఎస్ జగన్ సక్షించారు. ఘటన జరిగిన తర్వాత తీసుకున్న సహాయ చర్యలతోపాటు.. ఆస్పత్రుల్లో బాధితులకు అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. విశాఖ గ్యాస్ లీక్ జరిగిన ప్రాంతానికి సీఎం వైఎస్ జగన్ విశాఖకు బయలుదేరి వెళ్ళారు. అక్కడ అందుతున్న సహాయక చర్యలను సీఎం వైఎస్ జగన్ దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో సిఎం వెంట సిఎస్ నీలం సాహ్ని, ఇతర అధికారులు ఉన్నారు. గురువారం తెల్లవారుజామున ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో రసాయన వాయువు లీకైంది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు.
యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం:
విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదానికి ఎల్జీ పాలిమర్స్ యాజమాన్య నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్దారణ అయింది. లాక్డౌన్లోనూ పరిశ్రమలో ప్రతిరోజు మెయింటెనెన్స్ చేయాల్సి ఉన్నప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. లాక్డౌన్ ఉన్న కారణంగా మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం పాస్లు కూడా ఇచ్చింది. 45 మందికి మెయింటెనెన్స్ పాస్లు ఇచ్చినప్పటికీ.. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పరిశ్రమ ట్యాంకుల్లో దాదాపు 2 వేల మెట్రిక్ టన్నుల స్టైరెన్ను నిల్వ చేసింది. అక్కడ 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత ఉంచడంలో ఫ్యాక్టరీ యాజమాన్యం విఫలమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో.. స్టైరెన్ లీక్ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలకు స్టైరెన్ గ్యాస్ వేగంగా వ్యాప్తి చెందింది. కాగా, గురువారం తెల్లవారుజామన చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా, దాదాపు 200 మంది అస్వస్థతకు లోనయ్యారు.