- సీఎం జగన్ను చూసి ఉద్వేగానికి లోనైన పింగళి వెంకయ్య కుటుంబం
గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం మాచర్లలో పర్యటించారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబాన్ని సీఎం వైఎస్ జగన్ సత్కరించారు. వెంకయ్య కుటుంబసభ్యులు గుంటూరు జిల్లా మాచర్లలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం మాచర్లకు వెళ్లి వారిని సన్మానించారు.
సీఎం జగన్ను చూసి పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని సీఎం జగన్తో కలిసి పంచుకున్నారు. సీఎం వైఎస్ జగన్.. పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పింగళి జీవిత విశేషాలతో కూడిన చిత్రాలను సీఎం తిలకించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబసభ్యులకు సన్మానంతో రాష్ట్రంలో ఈ వేడుకలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.