తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైన్షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, క్లబ్బులు మూసివేసారు. ఆదివారం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాప్లు మూతపడనున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీచేశారు.తెలంగాణ వ్యాప్తంగా ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల పరిధిలోని మద్యం దుకాణాలన్నీ మూతపడనున్నాయి.
ఈనెల 14న మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంతో పాటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మళ్లీ మార్చి 14న పోలింగ్ ముగిసిన తర్వాతే తెరుచుకుంటాయి. అంతేకాదు ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే ఈనెల 17న కూడా వైన్ షాపులను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.