Take a fresh look at your lifestyle.

నేటి నుంచి రాష్ట్రంలో విద్యా సంస్థలు మూసివేత

  • కొరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం
  • అసెంబ్లీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన

తెలంగాణలో కొరోనా తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఆన్‌లైన్‌ ‌తరగతులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం అసెంబ్లీలో ఆమె కీలక ప్రకటన చేశారు. దేశంలో మారుమారు కొరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది. పొరుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కొనసాగుతుందనీ, రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ఇటీవల కేసుల సంఖ్య బాగా పెరిగిందని తెలిపారు. విద్యా సంస్థల్లో బోధన, బోధనేతర కార్యక్రమాలు సామూహికంగా జరుగుతున్నందున కొరోనా తీవ్రత మరింత పెరగిందని వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌మహారాష్ట్ర, పంజాబ్‌, ‌తమిళనాడు, గుజరాత్‌, ‌చత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే విద్యా సంస్థలను మూసివేసాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కోరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతున్నదనీ, విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు కూడా వొస్తున్నాయని చెప్పారు. ఈ పరిస్థితులను పూర్తిగా సమీక్షించిన ప్రభుత్వం విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు కొరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముందు జాగ్రత్త చర్యగా బుధవారం నుంచి రాస్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలన్నింటినీ తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఈ మూసివేత ఆదేశాలు వైద్య కళాశాలలు మినహాయించి రాష్ట్రంలోని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైబేటు విద్యా సంస్థలన్నింటికీ వర్తిస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజానీకం ప్రభుత్వం కొరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా విధిగా మాస్కులు ధరించాలనీ, తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలనీ, శానిటైజేషన్‌ ‌తదితర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply