నాగర్కర్నూల్,సెప్టెంబర్ 10.ప్రజాతంత్రవిలేకరి : బాలల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని మరియు బాలల రక్షణ కోసం మీడియా ప్రజాచైతన్యం తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉందని శ్రామిక వికాస కేంద్రం డైరెక్టర్ లక్ష్మణ్ రావ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో దేవకీ ఫంక్షన్ హాల్ లో శ్రామిక వికాస కేంద్రం ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సభ్యులకు బాలల చట్టాలు మరియు వాటి అమలు తీరుపై వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. నాగర్కర్నూల్ లో శ్రామిక వికాస కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతున్న గర్లస్ అడ్వోకసి అలియన్స్ కార్యక్రమం గురించి డైరెక్టర్ లక్ష్మణ్ రావు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల అభివృద్ధి కోసం స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇంకా బాల్య వివాహాలు, అక్రమ రవాణా, మాధ్యమిక విద్య డ్రాప్ అవుట్ జరుగుతున్నాయని అన్నారు.
వీటి నిర్మూలనకోసం ఎన్నో చట్టాలను తీసుకు వచ్చినప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. బాల్యవివాహాల చట్టంలో బాల్యవివాహాలను ప్రోత్సహించిన వారి పై అట్టి వివాహాన్ని జరిపిన వారి పై హాజరైన వారి పై చట్టపరంగా శిక్షఅమలు ఉన్నప్పటికి ఆ చట్టాన్ని నీరుగారుస్తున్నారని తెలిపారు. బాల్యవివాహాల చట్టాల పై రాజకీయ ప్రజాప్రతినిధులు ప్రమేయ ప్రభావాన్ని తగ్గిస్తే పూర్తిస్థాయిలో అరికట్టవచ్చని అన్నారు. ఫోక్సో 2012చట్టంను క్షేత్రస్థాయిలో నేటికి అమలు చేయకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఆడపిల్లలు తప్పిపోయినట్లయితే హ్యూమన్ ట్రాఫికింగ్ సెక్షన్కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పిల్లల రక్షణకోసం చట్టాల అమలులో కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసారు. వీటి నిర్మూలనకు మరియు ప్రజల్లో పూర్తి అవగాహన కోసం మీడియా సహకారం ఎంతైనా అవసరం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా వలన బాల్య వివాహాలు పెరిగిపోయాయని, బాలల పైన అఘాయిత్యాలు పెరిగాయని అన్నారు.
బాల్యవివాహాల నిర్మూలనలో మతపెద్దల పాత్ర అవసరం…
జిల్లా శ్రామిక వికాస కేంద్రం జిల్లా సమన్వయకర్త విష్ణు మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలనలో మత పెద్దల పాత్ర ఎంతైనా ఉందని అన్నారు. శ్రామిక వికాసకేంద్రం చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ 1992లో శ్రామికవికాస కేంద్రం కొల్లాపూర్ కేంద్రంగా ప్రారంభమైందని తెలిపారు. 2017 సంవత్సరం నుండి జిల్లా కేంద్రంగా పనిచేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మీడియా పాత్రికేయులు కిషోర్, ఉమా శంకర్, వెంకటస్వామి, పరమేశ్వర్, మల్లేష్, అహ్మద్, సందుయాదగిరి, వెంకటేష్, శ్యామ్, శివ, రామ్ ప్రకాష్, ప్రదీప్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.