- మొత్తం 117 సీట్లకు గాను 92 సీట్ల భారీ మెజారిటీతో అధికారంలోకి
- పూర్తిగా ఢీలా పడ్డ అధికారంలో ఉన్న కాంగ్రెస్… కేవలం 18 స్థానాలతో సరి
చండీఘడ్, మార్చి 10 : పంజాబ్లో అనుకున్నట్టే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పాగా వేసింది. తమ చీపురుతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఊడ్చి పారేసింది. దీంతో రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వొచ్చిన ప్రాంతీయ పార్టీగా ఆప్ నిలిచింది. ఇక్కడ కాంగ్రెస్ అనసవర రాజకీయలు చేసి, సిద్దూను ప్రోత్సహించడంతో అసలుకే మోసం వొచ్చింది. అందుకే గట్టిపోటీ ఇస్తుందనుకున్న కాంగ్రెస్..ఆప్కు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. 92 స్థానాలను ఆప్ గెలుచుకోగా కేవలం 18 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవగా.. ఇక్కడ బిజెపి ప్రభావం ఏ మాత్రం లేదని చెప్పవచ్చు. శిరోమణి అకాలీదళ్ 4 స్థానాల్లో గెలిచింది.
ఆప్ భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో పార్టీ శ్రేణులు విజయోత్సవంలో మునిగిపోయాయి. ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ ఇంటి వద్ద ఆప్ కార్యకర్తలు, నేతలు మిఠాయిలు పంచుకుని సెలబ్రెషన్స్లో మునిగిపోయారు. పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరో ఓటమి పాలవడంతో ఆ పార్టీ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ తన పదవికి రాజీనామా చేయనున్నారు. తాను పోటీ చేసిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఓటమి పాలు కావడంతో చన్నీ రాజీనామా చేసేందుకు గురువారం చండీఘడ్ నగరంలోని తన అధికార నివాసానికి వచ్చారు.