- తలసరి ఆదాయంతో పాటు అన్ని రంగాల్లో ముందున్నాం
- ఇతర రాష్ట్రాల్లో సెక్రెటేరియట్లు కూడా లేవు..మనం సమీకృత కలెక్టరేట్లు ఏర్పాటు చేసుకున్నాం
- వనపర్తిలో ‘మన ఊరు-మన బడి’ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కెసిఆర్
మహబూబ్నగర్,ప్రజాతంత్ర,మార్చి 8 : కష్టపడి తెచ్చుకున్న తెలంగాణా రాష్ట్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఇష్టపడి పని చేయడం వల్ల నేడు తెలంగాణా రాష్ట్రం అభివృద్ధి పథంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలబడిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం రూ. 51.70 కోట్ల నిధులతో నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆబ్కారీ, క్రీడలు మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, రాష్టప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ భవనంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ..తెలంగాణా రాష్ట్రం వొచ్చి కేవలం ఎనిమిది సంవత్సరాలు మాత్రమే అయ్యిందని, మనకన్నా ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న తమిళనాడు, ముంబయి, గుజరాత్ వంటి రాష్ట్రాల తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగం, మౌళికరంగాల్లో వాళ్ళకంటే ముందున్నామని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యుత్ ఉండదని, తెలివి లేదని హేళన చేసారని కానీ మనం ఏర్పాటు చేసుకున్న సమీకృత కలెక్టరేట్ భవనాలు ఇతర రాష్ట్రాల్లో సెక్రెటేరియట్లు కూడా లేవని ప్రశంసించారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగు నీరు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణా రాష్ట్రమని, 24 గంటల విద్యుత్ అన్ని రంగాలకు ఇస్తున్న రాష్ట్రం దేశంలో మరే రాష్ట్రం లేదని తెలియజేసారు. ఉమ్మడి ఆంధప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపు 13 వేల మెగావాట్ల పై చిలుకు పీక్ లోడ్ ఉంటే 10 ఉమ్మడి జిల్లాల తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుతం 14 వేల మెగా వాట్ల పీక్ లోడ్ ఉందని, దీన్ని బట్టి రాష్ట్రం విద్యుత్ ను ఏ స్థాయి లో వినియోగించుకుంతుందో అర్థం చేసుకోవచ్చన్నారు.
సాధించుకున్న తెలంగాణా రాష్ట్రంలో ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటున్నామని ఇపుడు విద్యా, వైద్యానికి పెద్ద పీట వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోజు వనపర్తిలో ప్రారంభించిన మన ఊరు- మన బడి కార్యక్రమానికి రూ. 10 వేల కోట్ల నిధులు ఖర్చు చేయడం జరుగుతుందని, జిల్లాలలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఒకప్పుడు లేబర్ జిల్లా వలసలకు మారుపేరైన వనపర్తి ప్రాంతం నేడు అన్ని విధాలుగా అభివృద్ధి సాధించిందన్నారు. ఇక్కడితో ఆగిపోవద్దని ఇంకా కష్టపడి జిల్లాను మరింత అభివృద్ధి పరచాలన్నారు. వనపర్తిని బంగారు పర్తి గా మరల్చాలని పేర్కొన్నారు. రాబోయేకాలంలో సాగునీటి సమస్య పూర్తిగా తొలగిపోతుందన్నారు. సి ఎం నిధులనుండి వనపర్తి జిల్లాకేంద్రానికి సాధారణ నిధులకు అదనంగా రూ. ఒక కోటి, మున్సిపాలిటీలకు 50 లక్షల చొప్పున, గ్రామపంచాయతిలకు 20 లక్షల చోప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలో అటవీ శాతం ఇంకా పెంచాలని, మొక్కలు బాగా పెంచాల్సిందిగా సూచించారు. హరిత హారం కింద పట్టణాలు,గ్రామాలలో మొక్కలు పెంచాలని అడవులు పునరుద్ధరించాలన్నారు. రాష్ట్రంలో సర్వీస్ రూల్స్ ను ఇతర రాష్ట్రాల నుండి వచ్చి అధ్యయనం చేసుకొని వెళ్ళేవిధంగా రూపొందిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగ విరమణ రోజు అతనికి అందాల్సిన అన్ని బెనిఫిట్లు చేతిలో పెట్టి ప్రభుత్వ వాహనంలో ఇంటిదగ్గర మర్యాదపూర్వకంగా దించిరావాలని సూచించారు.
ఉపాధ్యాయులకు లభించాల్సిన పదోన్నతులను కూడా త్వరలో ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా రాష్ట్రంలోని మహిళలందరికి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు పెద్దమందడి మండలం వీరాయపల్లి లో నిర్మించనున్న వేరు శనగ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, వనపర్తి పట్టణంలో నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ కార్యాలయ భవనం, 76.19 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న కర్ణేతాండ ఎత్తిపోతల పథకం, రూ. 5 కోట్లతో నిర్మించనున్న టౌన్ హాల్ భవనం, రూ. 38.40 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వ నూతన వైద్య కళాశాలకు అనుబంధ నర్సింగ్ కళాశాల భవనం, రాజపేట గ్రామంలో గొర్రెల పునరుత్పత్తి కేంద్ర నిర్మాణాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయాలను నిర్మించడం జరుగుతుందని , వనపర్తి జిల్లాలో 7వ కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. 1.2 లక్షల చదరపు అడుగుల్లో ఈ నూతన కకేక్టరేట్ సముదాయం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండి ప్రజలకు సేవ చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మదిలోని సంస్కరణల అనుసారం నిర్మించడం జరిగిందన్నారు.
రాష్ట్రంలోని 33 జిల్లాలు అన్ని రంగాల్లో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒకే నెలలో 31 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి కల్పించడం జరిగిందన్నారు. 2018 ప్రెసిడేన్షియల్ అర్దరు దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఉత్తమమైనదన్నారు. దీనివల్ల అన్నీ జిల్లాల్లో 95 శాతం స్థానికులకు ఉద్యోగావకాశాలు ఏర్పడ్డాయన్నారు. కొత్త నియామకాల్లో వనపర్తి, గద్వాల, ములుగు వంటి జిల్లాల్లో స్థానికులకు ఉద్యోగం వచ్చి పూర్తిస్థాయి సిబ్బంది కార్యాలయాలకు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఉద్యోగులు కష్టపడి వందశాతం విజయవంతం చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏ ఒక్క మైలు రాయిని వదలకుండా అధిగమిస్తామని ఉద్యోగుల తరపున హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వాగతం పలికారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆబ్కారీ, క్రీడల శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ఎంపీ లు పి. రాములు, మన్నే శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ యాష్మీన్ భాష, ఎమ్మెల్సీ లు కసిరెడ్డి నారాయణ రెడ్డి, గోరేటి వెంకన్న, శాసన సభ్యులు ఆల వేంకటేశ్వర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, లక్ష్మ రెడ్డి, జడ్పి చైర్మన్లు లోకనాథ్ రెడ్డి, సరితా, పి.ఏసి.ఎస్ చైర్మన్లు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జడ్పి టీసీలు, ఎంఎంపి లు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.