మార్చి 14న పోలింగ్ జరిపేందుకు ఇసి షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల, ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. తెలంగాణలో ఖమ్మం – వరంగల్-నల్గొండ, మహబూబ్నగర్ – రంగారెడ్డి -హైదరాబాద్ పట్టభద్రుల స్థానాలకు ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుండగా.. మార్చి 14న పోలింగ్ జరుగనుంది.
నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 23వ తేదీ వరకు గడువు ఇచ్చారు. 24న నామినేషన్లను పరిశీలించన్నారు. 26న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఇచ్చారు. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. తెలంగాణలో ప్రస్తుత ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎన్.రామచంద్రరావు పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది.