- ఆ పార్టీకి వోటు వద్దు…వద్దు…వద్దు
- కేంద్రం త్రిఫ్ట్ ఫండ్ను రద్దు చేస్తే..కెసిఆర్ ఇస్తున్నరు
- నేతన్నలతో ఆర్థిక మంత్రి హరీష్ రావు
వీణవంక మండలంలో నాలుగు చేనేత సొసైటీలకు రూ. 2 కోట్ల 81 లక్షల 29 వేల 91 చెక్కులు ఇస్తున్నాం..త్రిఫ్ట్ ఫండ్ మళ్లీ ఇస్తే బాగుంటుందని మంత్రి కేటీఆర్కు చెప్పగానే రూ. 30 కోట్లు విడుదల చేశారని మంత్రి హరీష్ రావు అన్నారు. వీణవంక మండలం కిష్టంపేటలోని పీఎస్ కల్యాణ మండపంలో చేనేత కార్మికులకు మంగళ వారం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..‘‘మీకు నచ్చినంత రూ. 800, 1200 కట్టుకుంటే ప్రభుత్వమే రెండింతలు ఇస్తుంది..దానికి ఆరు నెలల కోసం రూ. 30 కోట్లు కేటాయించాం..బిజెపి ప్రభుత్వం ఇచ్చింది.. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమిచ్చిందో ఆలోచించాలి..బీజేపీ ఉన్న పథకాలు ఊడగొట్టి చేనేత కార్మికుల నోట్లో మట్టి కొట్టింది. చేనేత కార్మికుల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం..ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డ్ను కేంద్రం రద్దు చేసింది..4 శాతం ఉన్న త్రిఫ్ట్ పథకాన్ని రద్దు చేసింది. ఢిల్లీవాళ్ళు 4 శాతం త్రిఫ్ట్ ఫండ్ను రద్దు చేస్తే.. సీఎం కేసీఆర్ 16 శాతం త్రిఫ్ట్ ఫండ్ ఇస్తున్నారు. చేనేతకారుల భీమా పథకాన్ని రద్దు చేస్తే..అలాంటి పథకాన్ని తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచన చేస్తుంది.
కేంద్రం రద్దు రద్దు అంటే..మనం వాళ్ళను వద్దు వద్దు అనాలి..రద్దులు బిజెపి ఇస్తే..పద్దులు టిఆర్ఎస్ ఇచ్చింది. రద్దుల వైపు ఉంటారా..పద్దుల వైపు ఉంటారా? మాయ మాటలు, మొసలి కన్నీరు, గ్రైండర్లు, కుట్టు మిషన్లు, బొట్టు బిళ్లల వైపు ఉందామా..పని చేసే ప్రభుత్వం వైపు ఉంటారా? చెప్పిన ప్రతి పనీ చేశాం..గతంలో 4 వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే..ఒక్క ఇల్లు కట్టివ్వలేదు. ఈ పాపానికి ఎవరు కారణమో అర్ధం చేసుకోవాలి. కొందరు ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు..4 వేల ఇండ్లు కట్టి 10 వేల మందిని ఇండ్లలోకి పంపించడం ఆత్మగౌరవం కదా? మీకు ఇండ్లు కట్టించే బాధ్యత నాది..చేనేత సొసైటీ భవనాల మరమ్మతులకు నిధుల మంజూరుకు కృషి చేస్తా. 50 ఏండ్లు కాంగ్రెస్, 20 ఏళ్ళు పాలించిన టీడీపీ మన కోసం ఏం చేశాయి..ఇవాళ ఎక్కడా ఇబ్బంది లేకుండా స్వచ్ఛమైన నీరు ఇస్తున్నాం.
పల్లెలను అద్భుతంగా తీర్చిదిద్దాం..కాళేశ్వరం ప్రారంభించిన రోజు పూర్తవుతదా అన్నారు..ఇవాళ మన పొలాల్లో గంగమ్మ గలగలా పారుతుంది. వీణవంకలో అడగగానే 24/7 హాస్పిటల్ మంజూరు చేశాం..పని చేసే ప్రభుత్వాన్ని దీవించండి. భవిష్యత్లో మీ కూలీ రేట్లు పెంచేందుకు కృషి చేస్తా. చేనేత కార్మికులు నష్టపోవద్దని బట్టలన్నీ ప్రభుత్వమే కొంటుంది. గతంలో ఈ పరిస్థితి ఉండెనా ఆలోచించాలి. ఇంకా రెండున్నరేళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది.. పని చేసే ప్రభుత్వం వైపు ఉంటే మనకే శ్రేయస్సు..ధరలు పెంచిన వాళ్లకు శిక్ష వేయాలా వద్దా? పేదలను పట్టించుకున్న వాళ్ళను గెలిపిద్దామా.. భారం వేసిన వాళ్ళను గెలిపించుకుందామా..పని చేసే సీఎం కేసీఆర్కు అండగా నిలవాలి’’ అని పిలుపునిచ్చారు.