- కెసిఆర్ రంగ ప్రవేశంతో తొలి విజయం : విశాఖ ఉక్కుపై మంత్రి కెటిఆర్
- కెసిఆర్ ప్రకటనతో వెనక్కి తగ్గిన కేంద్రం : ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్
- కెసిఆర్ నిర్ణయంతోనే ఉక్కుకు ఊపిరి : సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ అభినందనలు
హైదరాబాద్/విశాఖపట్టణం, ఏప్రిల్ 13 : విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరాటంతోనే కేంద్ర దిగివచ్చిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు గురించి కేసీఆర్, కేటీఆర్ నేను మాట్లాడం. కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగివచ్చి.. విశాఖ ఉక్కును అమ్మం.. బలోపేతం చేస్తామని కేంద్రం ప్రకటించింది. విశాఖ ఉక్కుపై ఏపీ అధికారపక్షం, ప్రతిపక్షం నోరు విప్పలేదు అని హరీశ్రావు గుర్తు చేశారు. ఏపీ ప్రజలు, కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంపై ఇకముందు కూడా పోరు కొనసాగిస్తాం అని స్పష్టం చేశారు. ఇది కేసీఆర్ విజయం.. బీఆర్ఎస్ విజయం.. ఇది ఏపీ ప్రజల విజయం.. విశాఖ కార్మికుల విజయం అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
కెసిఆర్ రంగం ప్రవేశంతో తొలి విజయం : విశాఖ ఉక్కుపై మంత్రి కెటిఆర్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ ప్రకటన విడుదల చేయడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ…విశాఖ ఉక్కుపై గట్టిగా మాట్లాడింది ఒక్క మన కేసీఆరే అని, తాము తెగించి కొట్లాడినం కాబట్టే విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు. కేసీఆర్ దెబ్బ అంటే అట్లా ఉంటదని కేటీఆర్ స్పష్టం చేశారు.
కెసిఆర్ ప్రకటనతో వెనక్కి తగ్గిన కేంద్రం : ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్
విశాఖ స్టీల్ను కాపాడేందుకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కృషి చేశారని ఆ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రమంత్రి ఫగ్గస్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ భవన్లో ఆయన వి•డియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ను కాపాడేందుకు కేసీఆర్ చాలా కృషి చేశారని, ఆంధ్రా పార్టీలు మాత్రం పోరాడలేదని విమర్శించారు. కేసీఆర్ మొదటి నుంచి ప్రైవేటీకరణపై పోరాడుతున్నారన్నారు. స్టీల్ ప్టాంట్ను అమ్మితే అధికారంలోకి వొచ్చాక కేసీఆర్ కొంటామని చెప్పారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలపైన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్పష్టమైన విధానాన్ని ప్రకటించారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తే.. తాము జాతీయీకరణ చేస్తామని స్పష్టం చేశారు. ఏపీలో వైసీపీ, టీడీపీ సహా ఇతర పార్టీలు ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. తెలుగు ప్రజల పక్షాన నిలబడేది బీఆర్ఎస్ పార్టీ అనే విశ్వాసం ఏర్పడిందన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు, ఉద్యోగులకు తాము అండగా ఉన్నామన్నారు.
కెసిఆర్ నిర్ణయంతోనే ఉక్కుకు ఊపిరి : సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ అభినందనలు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలంగాణ నుంచి ఒక బృందాన్ని పంపి.. వైజాగ్ స్టీల్ ఈవోఐలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నందుకు కేసీఆర్ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కేసీఆర్ నిర్ణయంతో విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వెళ్లకూడదని, ఆర్ఐఎన్ఎల్ను బలోపేతం చేయాలని కేంద్రం ఆలోచించడానికి కారణమైందన్నారు. తెలంగాణ ప్రభుత్వం బిడ్లో పాల్గొనాలని లక్ష్మీనారాయణ సూచించారు.