- జాబితాలో తెలంగాణపేరు లేకపోవడం దారుణం
- ట్విట్టర్ వేదికగగా మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పక్షపాత వైఖరిని ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఎండగట్టారు. 2021-22 సంవత్సరానికి ఆయా రాష్టాల్రకు కేటాయించిన వరద సాయం నిధుల జాబితాను ఎన్డీఆర్ఎఫ్ రెండు రోజుల క్రితం విడుదల చేసింది. ఆ జాబితాలో తెలంగాణ పేరు లేకపోవడాన్ని కవిత ప్రస్తావించారు. దీంతో ఆ జాబితాను తన ట్విట్టర్ ఖాతాలో ఆమె షేర్ చేస్తూ.. బీజేపీ పక్షపాత వైఖరిపై మండిపడ్డారు. హైదరాబాద్ ప్రజలకు వరద సాయం అందించడంలోనూ బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపుతుందని కవిత నిప్పులు చెరిగారు.
హైదరాబాద్ వరదల సమయంలో సీఎం కేసీఆర్ బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉన్నారన్న ఎమ్మెల్సీ కవిత, కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ ఆదుకోలేదని పేర్కొన్నారు. ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చూపుతున్న వివక్షపూరిత వైఖరితో మనసు కలచి చేస్తోందని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 2021-22 లో అనేక రాష్టాల్రను ఎన్డీఆర్ఎఫ్ నిధులు మంజూరు చేసిన కేంద్రం, తెలంగాణకు మాత్రం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకొన్నది. వరద బీభత్సంతో అల్లాడిపోయిన తెలంగాణకు రూ.1,350 కోట్ల తక్షణ సాయం, మొత్తం రూ.5 వేల కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులివ్వాలని సీఎం కేసీఆర్ ప్రధానమంత్రికి గతంలోనే లేఖ రాశారు. కానీ ఇప్పటిదాకా కేంద్రం నుంచి నయాపైసా రాలేదు.