నిరాశ, నిస్పృహలకు లోనై ఆత్మహత్యలు
ఆందోళన కలిగిస్తున్న ఆర్థిక పరిస్థితులు
ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగుల సంఖ్య ఏటేటా గణనీయంగా పెరగడం ఆందోళన కలిగించే అంశం. రైతుల ఆత్మహత్యల కంటే నిరుద్యోగుల ఆత్మహత్యలు గణనీయంగా పెరుగుతున్నట్లు ఇటీవల ఎన్సిఆర్బి నివేదికను పార్లమెంటులో వెల్లడించడం ఆందోళనకర అంశంగా మారింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీ అవుతున్న పోస్టులకు ప్రభుత్వాలు నోటిఫికేషన్లను ఇవ్వకపోవడంతో వయోపరిమితి వి•రితే ఇక శాశ్వతంగా ఉద్యోగాలకు దూరమవుతామనే భయాందోళనతో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాగే ప్రైవేట్లో కూడా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఉన్నత చదువులు చదివినా… నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు.
ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడిన వారి సంఖ్య కోవిడ్ తర్వాత మరింత పెరిగిపోయిందని అంచనా. దేశంలో కోవిడ్తో కోటి మందికి పైగా తమ ఉద్యోగాలను కోల్పోతే 97 శాతం మందికి కుటుంబ ఆదాయాలు భారీగా పడిపోయాయని సెంటర్ ఫర్ మానిటరింగ్(సిఎంఐఇ) ఇండియన్ ఎకానమి నివేదిక చెబుతుంది. ఈ ఎన్సిఆర్బి, సిఎంఐఇల నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాదేశవ్యాప్తంగా 2016లో 2298 మంది, 2017లో 2404 మంది, 2018లో 2741 మంది, 2019లో 2851 మంది ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఎన్సిఆర్బి నివేదిక చెబుతుంది. 2019లో ఆత్మహత్యలకు పాల్పడ్డవారిలో 18 ఏళ్లలోపు వారు 62 మంది ఉంటే, 18 నుంచి 30 ఏళ్లలోపు వారు 1366 మంది, 30 నుంచి 40 ఏళ్లలోపు వారు 1055 మంది, 40 నుంచి 60 ఏళ్లలోపు వారు 313 మంది ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉపాధి కల్పించకపోతే భవిష్యత్తులో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎపిలోనూ నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని బలవన్మరణానికి పాల్పడుతున్నారు.