- 48 గంటల్లోనే వివరాలు వెబ్సైట్లలో పెట్టాలి
- రాజకీయ పార్టీలకు సుప్రీమ్కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, (ఆర్ఎన్ఏ): నేర చరిత్ర ఉన్న రాజకీయవేత్తలకు సుప్రీమ్కోర్టు షాకిచ్చింది. అలాంటి నేతలను మోస్తున్న రాజకీయ పార్టీలు తమ వెబ్సైట్లలో ఆ కళంకిత నేతలకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 48 గంటల్లోనే వారి వివరాలను వెబ్సైట్లలో పెట్టాలని గురువారం ఆదేశించింది. ఏఏ నేతలపై ఎటువంటి నేరానికి సంబంధించిన కేసులు ఉన్నాయో, వారిని ఎందుకు పార్టీలో చేర్చుకున్నారో అన్న అంశాలను తమ తమ వెబ్సైట్లలో పొందుపరుచాలని కోర్టు తన తీర్పులో రాజకీయ పార్టీలను ఆదేశించింది. రాజకీయల్లో క్రిమినల్స్ పెరుగుతున్నారని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, రవీంద్ర భట్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.సోషల్ డియా, స్థానిక పత్రికల్లో కూడా నేర చరిత్ర కలిగి ఉన్న ప్రజాప్రతినిధుల గురించి రాజకీయ పార్టీలు వెల్లడించాలని కోర్టు సూచించింది.
రానున్న 72 గంటల్లో ఆ వివరాలను ఎన్నికల సంఘానికి తెలియజేయాలని కూడా కోర్టు ఆదేశించింది. అభ్యర్థుల ఎంపిక అనేది మెరిట్ ఆధారంగా ఉండాలని, కానీ గెలుపు శాతం ఆధారంగా కాదని కోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ రాజకీయ పార్టీలు నేర చరిత్ర కలిగిన నేతల వివరాలు ఇవ్వలేకపోయినా, లేక ఎన్నికల సంఘం తమ ఆదేశాలను అమలు చేయలేకపోయినా.. దాన్ని కోర్టు ధిక్కరణగా భావిస్తామని సుప్రీం పేర్కొన్నది. న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాతో పాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్ల ఆధారంగా సుప్రీం ఈ తీర్పును ఇచ్చింది. ప్రజాప్రతినిధి ఎటువంటి నేరానికి పాల్పడ్డాడు, దానికి సంబంధించిన కేసు విచారణ ఏ స్థాయిలో ఉన్నదన్న అంశాలను కూడా వెల్లడించాలని కోర్టు చెప్పింది. ఒక అభ్యర్థికి సీటు ఇవ్వడానికి గత కారణాలను కూడా రాజకీయా పార్టీలు వెల్లడించాలని కోర్టు పేర్కొన్నది.