- కేసీఆర్ నాటకాన్ని బయట పెట్టేందుకే ‘‘దండోరా, ఇంద్రవెల్లి సభకు అచ్చంపేట నియోజకవర్గం నుండి 156 వాహనాలు
- డీసీసీ జిల్లా అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ
అచ్చంపేట,ఆగష్టు9,(ప్రజాతంత్ర విలేకరి): తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గిరిజన, దళిత ఆత్మగౌవర దండోరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో దళిత ఆత్మగౌరవ దండోరా సభకు అచ్చంపేట నియోజకవర్గం నుంచి డీసీసీ జిల్లా అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో పెద్దఎత్తున శ్రేణులు బయలుదేరి వెళ్లాయి. నియోజకవర్గంలోని లింగాల, బల్మూర్,ఆమ్రాబాద్, ఉప్పునుంతల,వంగూర్, చారకొండ,అచ్చంపేట టౌన్ నుంచి 156 వాహనాలు ఇంద్రవెల్లి సభకు తరలి వెళ్లారు. ఇందుకు సంబంధించి పొద్దున్నే కాంగ్రెస్ శ్రేణులు దండోరా డప్పులతో సభకు ర్యాలీగా బయలు దేరారు. ముందుగా స్థానిక చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పిలుపు ఇవ్వడంతో డీసీసీ జిల్లా అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ సభకు నియోజకవర్గం నుండి భారీగా కార్యకర్తల, దళిత, గిరిజన ప్రజా సంఘాల సమీకరణ చేపట్టారు.
దండోరా సభకు లక్ష మందికి ఒక్కరు తక్కువైనా సీఎం కేసీఆర్కు గులాంగిరీ చేస్తామని ఇప్పటికే రేవంత్ ప్రకటించారు. ఈ సందర్భంగా డీసీసీ జిల్లా అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ కేసీఆర్ నాటకాన్ని బయట పెట్టేందుకే దండోరా మ్రోగిస్తున్నామని చెప్పారు. తుడుం దెబ్బ అంటే ఉడుము పట్టేనని నిరూపిస్తామన్నారు. కొమరంభీమ్ స్ఫూర్తితో మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్ని నిర్బంధాలు విధించినా లక్ష మందితో ఇంద్రవెల్లిలో సభ పెట్టి తీరుతున్నామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పై పోరాటం చేసేందుకు తెలంగాణ సమాజమంతా కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ ఏడున్నరేళ్ల పాలనలో దళితులు, గిరిజనులకు జరిగిన మోసాలను ఎండగట్టేందుకే ఈ దళిత, గిరిజన దండోరా సభను నిర్వహిస్తున్నామని చెప్పారు.
కేసీఆర్ అరాచక నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగానే దళిత,గిరిజన ఆత్మగౌరవ దండోరా జరుపుతున్నామని అన్నారు. కేసీఆర్ ఎన్నికల్లో దళిత, గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, మూడెకరాల భూమి ,ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. ఇప్పుడు ఎన్నికల కోసం దళిత బందు పేరుతో కొత్త నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. కేసిఆర్కు ఎన్నికలు వచ్చినప్పడే దళిత, గిరిజన, అట్టడుగు వర్గాలు గుర్తుకు వస్తారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు గడిచినా దళిత గిరిజనుల కోసం చేసింది శూన్యమన్నారు. కేసిఆర్ కల్లబొల్లి మాటలకు మోసపోయి గోస పడకుండ ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలిచి ఇంద్రవెల్లి సభను విజయవంతం చేసేందుకు తరలి వెళ్తున్నామని డీసీసీ జిల్లా అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ స్పష్టం చేశారు.