- జలప్రళయంతో విలవిల
- తిరుమల కొండల నుంచి జాలువారిన జలపాతాలు
- ఘాట్ రోడ్లపై విరిగిపడ్డ కొండచరియలు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో గత రెండు రోజులుగా అతిభారీ వర్షాలు కురిశాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వర్షంతో చిత్తూరు జిల్లా చిగురుటాకులా వణుకుతుంది. ఎడతెరపి లేని వర్షంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుమలలోని నాలుగు మాడవీధుల్లో పెద్దఎత్తున వరద నీరు చేరుకుంది.. క్యూలైన్లలో కూడా పెద్దఎత్తున వరద నీరు చేరింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా..తిరుపతి చుట్టుపక్కల ప్రాంతంలోని జలపాతాలు మత్తడి దూకుతున్నాయి. ఇక రోడ్లు, అండర్వే బ్రిడ్జీలు జలమయం అయ్యాయి. ఎక్కడికక్కడ వాహనాలు వరద నీటిలో చిక్కుకుపోగా..కొన్ని చోట్ల వరద ధాటికి తట్టుకోలేక పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందలు ఎదుర్కొన్నారు. ఒకచోట స్వర్ణముఖి నదిలో ఇల్లు కొట్టుకుపోయింది. ఇక పలు చోట్ల రోడ్ల వి•ద, ఇళ్లలో చేరిన వరద నీటిలో జనాలు ఈత కొట్టారు. తిరుపతి వరదలకు సంభందించిన వీడియోలు ప్రస్తుతం ట్విటర్లో ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా తిరుమల ఘాట్ రోడ్డుపై వరద పారుతుంది. దీంతో అధికారులు తిరుమల రెండు ఘాట్ రోడ్లను మూసివేశారు. తిరుమలకు భక్తులను టీటీడీ అనుమతించడం లేదు. రెండు కనుమ దారులపై కొండచరియలు విరిగిపడంతో ప్రమాదకరంగా మారాయి. మరోవైపు రెండో ఘాట్ రోడ్లో 18 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రయాణానికి ఇబ్బందిగా మారడంతో ఘాట్ రోడ్లను అధికారులు మూసివేశారు. కపిలతీర్థం, తిరుమల బైపాస్ రోడ్పై వందలాది వాహనాలు స్తంభించాయి.
రెండ్రోజుల పాటు కనుమ దారులను మూసివేశారు. తిరుమలలో ఆర్జితం ఆఫీస్ కిందభాగంలోని టీటీడీ సర్వర్ల గదుల్లోకి నీరు ప్రవేశించడంతో అన్ని యంత్రాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. తిరుపతి నుంచి తిరుమలకు చేరుకునే రెండవఘాట్ రోడ్డులో 9, 12 కిలోవి•టర్లు, హరిణి వద్ద కొండచరియలు విరిగి పడ్డాయి. మరికొన్ని ప్రదేశాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. గురువారం సాయంత్రం రెండు ఘాట్రోడ్లనూ మూసి వేశారు. తిరిగి ఎప్పుడు తెరిచేదీ టీటీడీ తర్వాత ప్రకటించనుంది. తిరుమలలో నారాయణగిరి కాటేజీ వెనుకభాగంలోని కొండల నుంచి భారీగా వర్షం నీరు ప్రవహించడంతో కొండచరియలు విరిగి కాటేజీలపై పడి దాదాపు నాలుగు గదులు ధ్వంసమయ్యాయి. ఆ గదుల్లో భక్తులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. తిరుమలలోని జేఈవో క్యాంపు కార్యాలయం నీట మునిగింది. తిరుమల కొండల నుంచీ భారీగా దిగువకు వొచ్చిపడుతున్న వర్షం నీరు తిరుపతి నగరాన్ని ముంచెత్తింది. కపిలతీర్థంలో జలపాతం ఉధృతి పెరగడంతో పుష్కరిణి నిండిపోయి ఆలయంలోకి నీరు ప్రవేశించింది. ఇక తిరుపతిలో 80 శాతం వీధులన్నీ జలమయమయ్యాయి. వర్షం నీరు ఇళ్లలోకి చేరింది. శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం, శనివారం దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు తరువాతి రోజుల్లో శ్రీవారి దర్శనానికి అనుమతిని ఇవ్వనున్నట్టు టీటీడీ ఈవో జవహర్రెడ్డి తెలిపారు. రేణిగుంట విమానాశ్రయ పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతో విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.