- నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
- కోవిడ్తో రాష్ట్రం అల్లకల్లోలం అవుతున్నా కెసిఆర్ బయటకు రాలే
- సిఎం తీరుపై మండిపడ్డ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తానని మోసం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దాంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ‘నువు తాగి ఫాంహౌస్లో పడుకున్నావు. ఈ ఆత్మహత్యలకు నువ్వే కారణం’ అని ఆరోపించారు. కోవిడ్ వొచ్చి రాష్ట్రం అల్లకల్లోలం అవుతున్నా బయటకు రాలేదని…బీజేపీ పొగ పెడితే ప్రగతి భవన్ నుండి మెల్లగా బయటికి వొచ్చాడని యెద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులకు వేసిన రైతు బంధు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు బ్యాంకులు కట్ చేసుకుంటున్నాయని… దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామిలను నెరవేర్చకపోతే… నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ వెంట పడుతుందని ఆయన హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో నాగర్కర్నూల్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ నియోజకవర్గాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందని సంజయ్ అన్నారు. అబద్ధపు మాటలు, హద్దులు దాటిన హామిలు, తప్పతాగిన మైకంలో సీఎం చేసే చేష్టలకు ప్రజలు విసుగెత్తిపోయారని మండిపడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని బండి సంజయ్ ప్రారంభించారు. కార్యకర్తలతో కలసి బైక్ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఉద్యమ సమయంలో, అధికారంలో వొచ్చిన తర్వాత ఇచ్చిన హామిలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ‘కేసీఆర్.. లక్ష ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నావ్. ఒక్క నోటిఫికేషన్ కూడా వేయని చరిత్ర నీది. నీ పాలనలో రైతులు, నిరుద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆత్మహత్యలే మిగిలాయి.
ప్రజలు కొరోనాతో అల్లాడుతుంటే.. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్న సమయంలో కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్రంలో అమలు పరుస్తున్న కేంద్ర సంక్షేమ పథకాలకు ప్రధాని ఫొటో తొలగించి నీ ఫొటోతో సోకులు చేసుకుంటున్నావ్. రానున్న కాలంలో నాగర్ కర్నూలు జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానం గెలిచి తీరుతాం. 2023 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ స్వయంగా అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రాబోతుంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి అన్ని పార్టీలు తహతహ లాడుతున్నాయి. గడీల పాలనకు వ్యతిరేకంగా, ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ఆగస్టు 9న హైదరాబాద్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి పాదయాత్ర షురూ చేస్తా’ అని బండి సంజయ్ అన్నారు.