- గ్రేటర్లో ఓడినా కెసిఆర్ అహంకారం దిగలేదు
- మా పార్టీ కార్పొటర్లకు 5 కోట్లు ఆఫర్ చేస్తున్నారు
- ఖమ్మం నుంచి పలువురు బిజెపిలో చేరిక..ఆహ్వానించిన బండి
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓడినా కేసీఆర్కు అహంకారం తగ్గలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బండి సంజయ్ సమక్షంలో ఖమ్మంకు చెందిన టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు. కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ గ్రేటర్లో మేయర్ ఎన్నికను వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్పొరేటర్లకు టీఆర్ఎస్ రూ.5 కోట్లు ఆఫర్ చేస్తుందని ఆరోపించారు. టీఆర్ఎస్ మా జోలికొస్తే వాళ్ల ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు అయిన తర్వాత కూడా మేయర్ను ఎందుకు ఎన్నుకోవడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలు వొచ్చి ఇన్ని రోజులైనా గ్రేటర్ సమావేశాన్ని ఎందుకు ఎన్నికల సంఘం జరపడం లేదన్నారు.
సిగ్గులేకుండా బీజేపీ కార్పొరేటర్లకు ఫోన్లు చేసి 5 కోట్లు, 6 కోట్లు ఇస్తామంటున్నారని అన్నారు. కేసీఆర్ నువ్వు గెలిగితే మేము గెలకాల్సి వొస్తుంది గుర్తుపెట్టుకో అంటూ హెచ్చరించారు. టిఆర్ఎస్ కార్పొరేటర్లు తమ పార్టీ లోకి వస్తామంటున్నారని అయినా తాము చేర్చుకోవడం లేదని అన్నారు. తాము స్టార్ట్ చేస్తే మరోలా ఉంటుందన్నారు. రాష్ట్ర పోలీసులను సీఎం కేసీఆర్ జీరోలను చేస్తున్నారని ఆరోపించారు. కొంత మంది పోలీస్లకు చెప్తున్నాం..ప్రజల కోసం పని చేయండి..కేసీఆర్ కోసం కాదని అన్నారు. శాంతిభద్రతలపై సీఎం చేతులెత్తేశారు..సమస్య వొస్తే అధికారులే బలవుతారని అన్నారు. తెలంగాణ పోలీసులు నిజంగా హీరోలేనన్నారు. 15 నిమిషాలు ఓల్డ్ సిటీని అప్పగిస్తే జల్లెడ పడుతారని చెప్పారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తాన్ వాళ్లను బయటకు తీస్తారని చెప్పుకొచ్చారు. నిజాయితీగా వ్యవహరించే పోలీసులకు 15 నిమిషాలు అప్పగించు… సంఘ విద్రోహ శక్తులను, రోహింగ్యాలను జల్లెడపడతారని అన్నారు. సీఎంకి దమ్ము ఉంటే అపని చేయి.. తెలంగాణ పౌరుషం ఉంటే పోలీస్లకు అధికారం ఇవ్వు… మేము మేయర్గా గెలిస్తే పోలీసులకు పాత బస్తి అప్పగించాలని అనుకున్నామని అన్నారు.