- కాంగ్రెస్ వోటమికి కారణాలు తెలుసుకోవాలి
- మా ప్రభుత్వంలో కుంభకోణాలు, లంబకోణాలు లేవు
- పరిశ్రమలను ప్రోత్సహించడం గ్లోబల్ఫినామినా
- మోదీప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే
- ప్రతిపక్షంపై సీఎం కేసీఆర్ ఫైర్
బీజేపీ నీచ బుద్ధి మార్చుకోవాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం శాసనసభలో ఘాటు విమర్శ చేశారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ చేసిన తప్పులనే బీజేపీ చేస్తున్నదని ముఖ్యమంత్రి తూర్పారపట్టారు. కేంద్ర ఆర్థికరాజకీయ విధానాలనుగురువారం శాసనసభలో ముఖ్యమంత్రి కడిగిపారేశారు. విమర్శలపై విమర్శలు గుప్పిస్తూ బీజేపీ కేంద్ర నాయకులు వైఖరిని, రాష్ట్ర నాయకుల వైఖరిని ప్రస్తావించి చీల్చిచెండాడారు. రాష్ట్రం కేంద్రానికి ఏటా 50వేల కోట్ల పన్నులు కడుతున్నారని, కేంద్రం మాత్రం పదివేల కోట్లు కూడా నిండా ఏ సంవత్సరం ఇవ్వలేదని దులిపిపారేశారు.ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలు పట్టాల్సి వస్తుందని విమర్శించారు.
పన్నులు వసూలు చేసి, ఆయారాష్ట్రాల ఆదాయ నిష్పత్తి ప్రకారం రాష్ట్రాలకు పంచాల్సిన బాధ్యత కేంద్రానిదని ఆయన చెప్పారు దేశానికి అత్యధిక నిధులను సమకూరుస్తున్న ఐదారు రాష్ట్రాలలో తెలంగాణ మొదటిస్థానంలో ఉన్నదని ఆయన పేర్కొన్నారు.నీతిఅయోగ్ సిఫారసు చేసినప్పటికీ, 14 వ ఆర్థికసంఘం ప్రశంసించినప్పటికీ, మిషన్భగీరథకు సిఫారసు చేసిన 20వేల కోట్ల నిధులపైన ఇంతవరకు కేంద్రం స్పందించలేదని విమర్శాస్త్రాలు సంధించారు.15 వ ఆర్థిక సంఘం ఇవ్వమని చెప్పిన రూ.780 కోట్లు నిధులపైన కేంద్రం తన వైఖరిని చెప్పడంలేదని అన్నారు.దేశంలో కాంగ్రెస, బీజేపీ ఆర్థికవిధానాల్లో అట్టర్ఫ్లాప్ అయ్యాయని సీఎం విశ్లేషించారు.జీఎస్టీ ద్వారా గొప్పలు సాధించాలని ఏదో చెద్దామని అనుకున్నారనికానీ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాలు ఇవ్వకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని అన్నారు.
బీజేపీ రాష్ట్రానికి మెహర్బానీ చేసినట్లు మాట్లాడుతున్నదని పేర్కొన్నారు. బీజేపీ యాభై అరవై ఏండ్ల నుంచి కొట్లాడితే 2014లో అధికారంలోకి వచ్చిందని, టీఆర్ఎస్ పోటీచేసిన మొదటిసారే తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని ఆయన ఉదహరించారు. ప్రజల విశ్వాసాన్ని, ఆశీర్వాదాలను అందుకోవడంలో టీఆర్ఎస్ అగ్రభాగంలో ఉన్నదని, మిగతా రాజకీయపార్టీలు దరిదాపుల్లో కూడా లేవని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్పార్టీ నాయకులు అవే రొడ్డకొట్టుడు విమర్శలే చేస్తున్నారని, కుంభకోణాలు, లంబకోణాల మాటలు తప్ప కొత్త రాజకీయ విధానాలను అలవరచుకోవడంలేదని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ విధానాలను, పద్ధతులను మార్చుకోవాలని, అంతర్గతంగా విశ్లేషించుకోవాలని సూచించారు.
ప్రజలు ఏమి కోరుతున్నారనే విషయంలో కాంగ్రెస్ బీజేపీ నాయకులకు స్పష్టత లేదని అందుకే వారిని ప్రజలు ఓడగొడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ వారికి ఇప్పటికీ కూడా తాము ఎందుకు ఓడిపోతున్నామనే విషయం అర్థం కావడంలేదని జాలిపడ్డారు.కాళేశ్వరం వంటి బహుళార్థ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ద్వారా సాధించిన అద్భుత విజయానలు కాంగ్రెస్ బీజేపీలు ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని ్ర ప్రశ్నించారు. 978 గురుకులాల్లో రాష్ట్ర విద్యార్థులు సాధించిన అనూహ్య విజయాలను ఎందుకు గమనించడంలేదని ప్రశ్నించారు. గిరిజన కొండల్లో నుంచి వచ్చిన ఆడపిల్లలు అంటార్కిటాక్ ఎత్తులోకి వెళ్లి దేశకీర్తిని ఘనంగా చాటిచెప్పారని ఉదహరించారు. తెలంగాణ చరిత్రలో ఏనాడే లేని విధంగా 39లక్షల ఎకరాల వరిసాగు అవుతున్నదని, వరిసాగుకు అవసరమైనన్ని నీటిసదుపాయాలను అందిస్తున్నామని చెప్పారు. 100 మీటర్ల ఎత్తునుంచి ప్రారంభమైన గోదావరి ఇప్పటికే సముద్రమాట్టం నుండి 300 మీటర్లకు ఎగిరి దుముకున్నదని ఆయన చెప్పారు. విద్యుత్తురంగంలో మహోన్నత ప్రగతిని సాధించామని సీఎం పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 24లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉండగా, ఇప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 30లక్షల వరకు వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయని చెప్పారు.
పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం గ్లోబల్ఫినామినా:
పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం ప్రభుత్వాల కర్తవ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పారిశ్రామిక ప్రగతి ద్వారానే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ లక్ష్యంతోనే పౌల్ట్రి పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఇచ్చామని ఆయన చెప్పారు.కోళ్ల పరిశ్రమ దేశంలోనే నెంబర్ఒన్ స్థానంలో ఉన్నదని , వారిని మరింత ప్రోత్సహిస్తే కచ్చితంగా తెలంగాణ ఆదాయం పెరుగుతుందని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆయన చెప్పారు. ఇప్పటికే 25లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించాయని సీఎం పేర్కొన్నారు.తెలంగాణ పౌల్ట్రీ పరిశ్రమ ఏటా రూ.1200కోట్ల జీఎస్టీ చెల్లిస్తున్నదని సీఎం చెప్పారు.25వేల మంది రైతులు ఈ పరిశ్రమమీద ఆధారపడిఉన్నారని చెప్పారు.కోళ్లపరిశ్రమకు రాయితీలు, సబ్సిడీలు ఇవ్వడం వల్లనే పరిశ్రమ గొప్పగా నిలదొక్కుకుంటున్నదని, అనుబంధంగా మక్కజొన్న రైతులకు ఆదాయవనరులు సమకూరుతున్నాయని సీఎం చెప్పారు.
ఒకవైపున మార్కె•ఫెడ్ను,.. మరోపక్క రైతులను ఆదుకుంటూ కోళ్లపరిశ్రమకు సబ్సిడీలు ఇచ్చామని, లక్షలమంది ఉపాధి అవకాశాలు దృష్టిలో పెట్టుకొని ఈ సాయం అందించామని చెప్పారు.తడిసిన ధాన్యం కొనాలని, రైతులను ఆదుకోవాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తుంటుందని, తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభత్వం ఏ విధంగా అమ్ముతుందని ఆయన ప్రశ్నించారు. రైతుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని నష్టాలను భరిస్తూ తడిసిన ధాన్యాన్ని తేమ ఎక్కువ ఉన్న పత్తిని ప్రభుత్వం మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నదని సీఎం సమాధానం చెప్పారు.ఈ కారణంగానే మక్కజొన్న రైతులకు టన్ను రూ.18వేలవరకు గిట్టుబాటు అయ్యిందని సీఎం పేర్కొన్నారు.