రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆయా పార్టీలు పోటీరికి రంగం సిద్ధం చేస్తున్నాయి. మార్చి 14న మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించ నున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రస్తుత ఎమ్మెల్సీ రాంచందర్రావు పేరును, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది.
ఈ మేరకు బీజేపీ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్ రామచంద్రరావు, పల్లా రాజేశ్వర్రెడ్డిల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈ ఎన్నికలతోపాటే ఆంధప్రదేశ్లోని ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల టీచర్స్ నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ తెలిపింది. వరంగల్ స్థానానికి టిఆర్ఎస్ ఇప్పటికే పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. హైదరాబాద్కు ఖరారు చేయాల్సి ఉంది.
ఇదిలావుంటే ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు సాగర్ ఉప ఎన్నికపై బిజెపి దృష్టి సారించింది. త్వరలో నాగార్జునసాగర్లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. బీజేపీ జాతీయ నేతలు సభకు హాజరుకానున్నారు. ముఖ్యంగా లంబాడి వోట్లపై కమలనాథులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉప ఎన్నిక ముందు లంబాడి కీలక నేత బీజేపీలో చేరనున్నారు. సాగర్లో ఇప్పటికే ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయిలో పని మెదలు పెట్టింది. ప్రతి 50 వోట్లకు బీజేపీ ఒక ప్రతినిధిని పెట్టింది. గుర్రంపోడు అరెస్ట్లను బీజేపీ సీరియస్గా తీసుకుంది. మరోసారి గుర్రంపోడు వెళ్లేందుకు బండి సంజయ్ సిద్ధమవుతున్నారు.