- రజాకారులను తరిమికొట్టిన చరిత్ర ఉన్న నగరం
- పేదలకు ఆరోగ్య బీమా రాకుండా అడ్డుకుంటున్న కెసిఆర్
- నగర పర్యటనలో భాగంగా మీడియాతో కిషన్ రెడ్డి
- సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సందర్శన.. భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు
వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి నరేంద్రమోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన హన్మకొండ సర్క్యూట్ గెస్ట్ హౌస్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు. వరంగల్ నగరంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో జరుగుతున్న పనులను పరిశీలించి, వాటిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించానన్నారు. హైదరాబాద్ తరువాత అతిపెద్ద చారిత్రక నగరం, రాజకీయ చైతన్యం ఉన్న నగరం, రాజాకారులను తరిమికొట్టిన చరిత్ర ఉన్న నగరం వరంగల్ అని అన్నారు. ఇక్కడి ప్రజలకు చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన బయటి ప్రాంతాలకు వెళ్లకుండా మోడీ ప్రధాని అవ్వగానే రూ.150 కోట్లతో మల్టీ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టి ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్కి ధీటుగా ఇది నిర్మించామని, కేంద్రం రూ.120 కోట్లు, 30 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి నిర్మించిందని, పేదలకు 10 రకాల అత్యవసర ఆరోగ్య సమస్యలు పరిష్కారం అయ్యేలా ఈ హాస్పిటల్ నిర్మాణం చేపట్టామన్నారు. 2014 నుండి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు ఇవ్వడంలో తాత్సారం చేస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు మాత్రమే ఇచ్చి మిగతా నిధులపై నిర్లక్ష్యం వహిస్తుందని, ఇప్పటికే హాస్పిటల్కు చేరుకున్న పరికరాలు మూడేళ్ళవుతున్నా నిరుపయోగంగా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని యుద్ధప్రాతిపదికన 30 కోట్లు కేటాయించాలన్నారు.
సీఎం కేసీఆర్ దుబారా ఖర్చు చేస్తూ..ఈ హాస్పిటల్కు మాత్రం నిధులు ఇవ్వడం లేదన్నారు. ఆయుష్మాన్ భారత్ దేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలు అవుతుందని, కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన తప్పుడు నిర్ణయం వల్ల ఇక్కడ అమలు కావడం లేదన్నారు. ఇక్కడి పేద ప్రజలకు ఆరోగ్య బీమా రాకుండా
అడ్డుకుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం హృదయ్ పథకం కింద భద్రకాళి బండ్ నిర్మాణం, జైన్ మందిర్ను అభివృద్ధి చేయడం జరుగుతుందని, పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష చేశానని, కాజిపేట వ్యాగన్ ఒరాయిలింగ్ ఫ్యాక్టరీ పై సౌత్ స్ట్రల్ రైల్వే అధికారులతో సమీక్ష చేశానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన 160 ఎకరాల భూమి సీఎం కేసీఆర్ కేటాయించడం లేదన్నారు. సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్వర కుమార్కు లేక రాశానని ఆయన స్పందించడం లేదన్నారు. ఇక్కడి మేధావులు, విద్యావంతులు, యువకులు, ప్రజలు ఉద్యమం చేసైనా ఈ ఫ్యాక్టరీ సాధించుకోవాలని కోరుతున్నానన్నారు. రూ.500 కోట్లు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దాంట్లో మొదటి దశగా రూ.196 కోట్లు ఇచ్చామని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ఢిల్లీ నుండి మోది ఇన్ని నిధులు ఇస్తే ఇక్కడే ఉన్న సిఎం కెసిఆర్ ఒక్క రూపాయి ఇవ్వడం లేదని విమర్శించారు. వరంగల్ నగరానికి ప్రతి ఇంటికి మంచినీరు, భద్రకాళి చెరువు, వెయ్యిస్తంబాల దేవాలయం, నగరంలోని కూడళ్లు, ఎంజిఎం హాస్పిటల్ వద్ద మురుగు శుద్ధి కేంద్రం, లైబ్రరీ ల కోసం 5 కోట్లు కేటాయించామని, కాజీపేట దర్గా కోసం రూ.1 కోటితో అభివృద్ధి పనులను మంజూరు చేశామన్నారు.
దేశంలోనే మొదటి జాతీయ రహదారిని సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టామని, అది అతిత్వర లోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ప్రారంభిస్తామన్నారు. మమునూరు ఎయిర్ పోర్ట్కు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతతో పని చేస్తానని, కేంద్ర మంత్రిగా బాధ్యతగా అభివృద్ధికి కృషి చేస్తాననన్నారు. నాకు వరంగల్ జిల్లాకు 1996 నుండి అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ నాకు అణువణువు తెలుసుననన్నారు. హైదరాబాద్లో ఆదరబాధగా ఎన్నికలు పెట్టి బీజేపీని బలహీన పరచాలని చూసారన్నారు. కానీ టిఆర్ఎస్ బొక్కబోర్ల పడిందన్నారు. వరంగల్ లో కూడా వరదలు వచ్చాయని, తాను చూసానని ఇక్కడ కూడా రూ.10వేలు ఇవ్వాలన్నారు. అనంతరం హన్మకొండ న్యూశాయంపేట టీవీర్ గార్డెన్స్లో జరిగిన బిజెపి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు రావుపద్మ, మాజీ ఎమ్మెల్యే ధర్మా రావు, మాజీ మంత్రి విజయరామరవు, మాజీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, రాకేష్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తల నుద్దేశించి ఆయన మాట్లాడుతూ దేశంలో ఒక్కరోజు సెలవు లేకుండా మోడీ పాలన చేస్తుంటే రాష్ట్రంలో ఒక్కరోజు కూడా సెక్రటరేయట్కు రాకుండా పాలిస్తున్నారన్నారు. అక్కడ అవినీతికి అవకాశం లేకుండా మోడీ పాలిస్తున్నారని, ఇక్కడ వేల కోట్ల అవినీతితో సీఎం కేసీఆర్ పాలిస్తున్నారని దుయ్యబట్టారు.
హైదరాబాద్లో మజ్లీస్ లేకపోతే టిఆర్ఎస్కు పుట్టగతులు లేవన్నారు. టిఆర్ఎస్, మజ్లీస్ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు. మొదటి అడుగు దుబ్బాక, రెండవ అడుగు హైదరాబాద్ వేశారని, మూడవ అడుగు వరంగల్ ప్రజలు వెయ్యాలని పిలుప •నిచ్చారు. వరంగల్లో కూడా కషాయం జెండా ఎగరాలి. కేసీఆర్, కేటీఆర్, ఒవైసీ బట్టలు ఇప్పుకొని తిరిగినా 2023 లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. 2023లో బీజేపీ రావాలని తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు, యువత, మహిళలు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణలో తండ్రీ కొడుకుల కుటుంబ పాలన పోవాలని, ప్రజాస్వామ్య పాలన రావాలన్నారు. టిఆర్ఎస్పై బీజేపీ కార్యకర్తలు ఏ రకమైన ఉద్యమానికైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వరంగల్•లో పోలింగ్ బూత్ స్థాయి కమిటీ బీజేపీలో పటిష్టంగా పని చేయాలని, కార్యకర్తలే బీజేపీ పార్టీకి ఆయువు పట్టు అన్నారు.