- రైతుల నిరసన.. నిలిచిపోయిన కాన్వాయ్
- ప్రధాని రాకతో మిన్నంటిన అన్నదాతల ఆందోళన
- 20 నిమిషాలపాటు రోడ్డుపై కదలలేక పోయిన మోడీ
- కార్యక్రమాలను రద్దు చేసుకుని వెను తిరిగి దిల్లీకి
న్యూ దిల్లీ, జనవరి 5 : ప్రధాని మోడీకి పంజాబ్లో చేదు అనుభవం ఎదురయ్యింది. రైతులు ప్రధానిని రాకుండా అడ్డుకున్నారు. ఎన్నికల సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్న ప్రధాని కార్యక్రమాలను రద్దు చేసుకుని వెనక్కి తిరుగు పయనమయ్యారు. పంజాబ్ వెళ్లిన ప్రధాని మోడీ కాన్వాయ్ 20 నిమిషాల పాటు రోడ్డుపైనే ఆగిపోయింది. తర్వాత వెనుదిరిగి ఎయిర్పోర్ట్కు వెళ్లారు. ఈ ఘటనపై కేంద్ర హోమ్ శాఖ సీరియస్ అయింది. భద్రతాలోపంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. స్పందించిన సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ..భారత ప్రధాని భద్రతా చర్యల్లో లోపం లేదని స్పష్టం చేశారు. మరోవైపు, ప్రధాని హాజరయ్యే ర్యాలీకి ప్రజలు రాకుండా అడ్డుకోవడాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తప్పుబట్టారు. ప్రధాని సభకు ప్రజలు రాకుండా పోలీసులు కుట్ర చేశారని ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పంజాబ్ సీఎం చన్నీ ఏమాత్రం ఇష్టపడలేదని విమర్శించారు. ఇదిలావుంటే, పంజాబ్లోని ఫిరోజ్పూర్ ర్యాలీలో ప్రధాని మోడీ పర్యటన రద్దు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. మరోవైపు పంజాబ్లో అన్నదాతల ఆందోళన మోడీ టూర్కు అడ్డంకిగా మారింది. ఫలితంగా పంజాబ్ పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకున్నారు. ఇటీవల కాలంగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు జరుపుతున్నారు ప్రధాని మోడీ. మోడీ పర్యటనను నిరసిస్తూ.. రైతులు ఎక్కడికక్కడ రోడ్లను దిగ్బంధించారు. మోడీ కాన్వాయ్ ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోయింది.
చేసేది లేక ప్రధాని మోడీ తన పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకున్నారు. భద్రతా కారణాల రీత్యా ఫిరోజ్పూర్ టూర్ రద్దు అయ్యినట్లు అధికారులు తెలిపారు. అయితే, శంకుస్థాపన కార్యక్రమం ఎలా నిర్వహించాలనే దానిపై సమాచారం లేదు. మరోవైపు, బుధవారం ఫిరోజ్పూర్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జి.నాగేశ్వరరావు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కోసం పంజాబ్ పోలీసులు ఎన్ఎస్జి, ఆర్మీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్తో సమన్వయంతో పనిచేస్తున్నారు. యాంటీ డ్రోన్ బృందాన్ని కూడా రంగంలోకి దింపారు. బుధవారం ఉదయం ఫిరోజ్పూర్లో అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోడీ పంజాబ్ చేరుకున్నారు.
మోడీ షెడ్యూల్ ప్రకారం, ఢిల్లీ అమృత్సర్ కత్రా ఎక్స్ప్రెస్వే,శాటిలైట్ సెంటర్తో సహా రూ. 42,750 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ఇక్కడ ర్యాలీ స్థలం నుండి శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఉదయం ప్రధాని మోడీ విమానంలో భటిండాలో దిగారు. ఆ తర్వాత భారతదేశం పాకిస్తాన్ సరిహద్దు సవి•పంలో ఉన్న జిల్లాకు బయలుదేరారు. రెండేళ్ల తర్వాత ప్రధాని మోడీ పంజాబ్ చేరుకున్నారు. అదే సమయంలో ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత ప్రధాని రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ముందు రాష్ట్రంలోని ఫిరోజ్పూర్ జిల్లాలో దాదాపు 10,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.