Take a fresh look at your lifestyle.

2026‌లో భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తాం

  • ఎయిర్‌పోర్టుకు ఎపి సిఎం జగన్‌ ‌శంకుస్థాపన
  • 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో నిర్మాణం

విజయనగరం, మే 3 : భోగాపురం విమానాశ్రయాన్ని 2026లో మల్లీ తామే ప్రారంభిస్తామని సిఎం జగన్‌ ‌ప్రకటించారు. 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో భోగాపురంలో నిర్మించతలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం జగన్‌ ‌శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన జగన్‌ ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఉత్తరాంధ్రలో వచ్చి స్థిరపడేలా అభివృద్ధి జరగబోతోందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు మూడేళ్లలో పూర్తయి విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుందన్నారు. ఇవాళ ఇక్కడ పునాది రాయి వేశాం.. మళ్లీ 2026లో మళ్లీ ఇక్కడికే వచ్చి ఇదే ప్రాజెక్టును ప్రారంభించబోతున్నాం. ప్రజల దీవెనులు ఉన్నంత వరకు ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ఎవరూ ఏం చేయలేరన్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల లక్షల మందికి ఉద్యోగాలు వొస్తాయన్నారు జగన్‌. 24 ‌నెలల నుంచి 30 నెలల్లోపే పూర్తి అవుతుందని జగన్‌ ‌ధీమా వ్యక్తం చేశారు. ఈ విమానాశ్రయానికి అనుమతులు మంజూరు చేసిన ప్రధానికి జగన్‌ ‌కృతజ్ఞతలు తెలిపారు. భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలను పునరావాస గ్రామాలకు తరలించామన్నారు. 80 కోట్లతో గేటెడ్‌ ‌కమ్యూనిటీ తరహాలో నిర్మాణాలు చేపట్టామన్నారు. ఇవన్నీ నాలుగేళ్లలో పూర్తి చేసినట్టు తెలిపారు. భోగాపురంపై టీడీపీ హయాంలోనే పక్రియ పూర్తయి ఉంటే పనులు ఎందుకు సాగలేదని జగన్‌ ‌ప్రశ్నించారు. కోర్టుల్లో కేసులను పరిష్కరించుకుంటూ వచ్చామన్నారు. భూసేకరణ పూర్తి చేశామన్నారు.

అన్ని అనుమతులు తీసుకొచ్చామని తెలిపారు. టెండర్ల పక్రియను పూర్తి చేసి ఈ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ఇవన్నీ కాకుండానే ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు మాత్రమే టెంకాయ కొట్టి వెళ్లిపోయారని చంద్రబాబును ఎద్దేవా చేశారు. మళ్లీ ఏ మాత్రం సిగ్గులేకుండా గతంలోనే శంకుస్థాపన చేశామని చెప్పుకోవడం దారుణమైన రాజకీయాలు ప్రపంచంలోనే ఎక్కడా ఉండబోవన్నారు. అల్లూరి జన్మించిన పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర కోసం ప్రభుత్వం చేస్తున్న పనులను గుర్తు చేసుకోవాలని ప్రజలను కోరారు. ఆయన పేరుతో ఓ జిల్లా ఏర్పాటు చేశామన్నారు. ఆరు జిల్లాలుగా చేసి కలెక్టర్లను నియమించామన్నారు.ఉత్తారంధ్రలో కిడ్నీ రీసెర్చ్ ‌సెంటర్‌ను నిర్మించామని అన్నారు. త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. దశాబ్దాలుగా ఈ సమస్య ఉన్నా ఏ ఒక్కరూ చిత్తశుద్ధి చూపలేదని అన్నారు. ఆ సమస్య లేకుండా చేయాలని… ఇచ్చాపురం, పలాసకు హిరమండలం నుంచి తాగునీరు సరఫరా చేయబోతున్నామన్నారు.

700 కోట్ల రూపాయలతో చేపట్టే పైప్‌ ‌లైన్‌ ‌ప్రాజెక్టును ఈ జూన్‌లో శ్రీకాకుళం ప్రజలకు అంకితం చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు బాగా చదవాలని ఆలోచించి… కురుపాం ట్రైబల్‌ ఇం‌జినీరింగ్‌ ‌కాలేజీ, పాడేరులో ట్రైబల్‌ ‌మెడికల్‌ ‌కాలేజీ పనులు చేపట్టాం. పార్వతీపురంలో మరో మెడికల్‌ ‌కాలేజీ పనులు, నర్సీపట్నంలో మెడికల్‌ ‌కాలేజీ పనులు వేగంగా సాగుతున్నాయి. విజయనగరం మెడికల్‌ ‌కాలేజీ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఉత్తరాంధ్రలో నాలుగు మెడికల్‌ ‌కాలేజీలు, ట్రైబల్‌ ఇం‌జినీరింగ్‌ ‌కాలేజీ కడుతున్నామన్నారు. ఈ మధ్య కాలంలోనే మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశామ న్నారు. మరో మూడేళ్లలోనే అది పూర్తి కానుందన్నారు. ఇవాళ భోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపన చేశామన్నారు. కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ‌స్పీకర్‌ ‌తమ్మినేని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply