జిల్లా జైలులో బిజెపి కార్యకర్తలకు బండి పరామర్శ
ఐపీఎస్లు క్రిమినల్స్గా మారుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న భైంసా అల్లర్లలో అరెస్టు అయిన కార్యకర్తలతో ములాఖత్ అయ్యారు. ఈ మేరకు కార్యకర్తలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అమాయకులను అరెస్ట్ చేసి అక్రమంగా కేసులు పెట్టి వేదిస్తున్నారని అన్నారు. భైంసా అల్లర్లపై జ్యుడీషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పోలీసులు అసలు నిందితులను వదిలేసి తమను అక్రమంగా అరెస్టు చేశారని కార్యకర్తలు మొరపెట్టుకున్నారు. భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ పరంగా పూర్తిగా అండగా ఉంటామని బండి సంజయ్ హామి ఇచ్చారు.
తమ కార్యకర్తలను పోలీసులు హింసించారని మండిపడ్డారు. అమాయకులను భయభ్రాంతులకు గురి చేసి, బెదిరించి కేసులు పెట్టారని పోలీసుల వైఖరీపై ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్కు మానవత్వం లేదన్నారు. ఓవైసీ కోసం కేసీఆర్ హిందువులను బలి చేస్తున్నడని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కొడుక్కు అదే గతి పట్టిస్తామని హెచ్చరించారు. భైంసా దారుణాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులే హిందు మతానికి వ్యతిరేకంగా సంస్థలు నడుపుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఒక ఐపీఎస్ అధికారి ఆధారాలతో సహా దొరికితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
ఆసంస్థకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో విచారణ జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సమాజంలో వైషమ్యాలు సృష్టిస్తున్న స్వేరోస్ సంస్థపై వెంటనే చర్య తీసుకోవాలన్నారు. సంస్థకు నిధులెక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. ఆ సంస్థ నిధుల లెక్కలు తీస్తారా లేక కేంద్రానికి ఫిర్యాదు చేసి అక్కడినుంచి తీయించమంటారా? అని ప్రశ్నించారు. హిందువులను కించపరిచే కార్యక్రమాలు జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. హిందూ వ్యతిరేకులను ప్రోత్సహించడమే సీఎం కేసీఆర్ తన విధిగా చేసుకున్నారన్నారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నప్పటికీ సీఎం మౌనం వహించడం ఆయన పతనానికి నాంది కాబోతుందన్నారు.