క్షేత్ర స్థాయిలో యువ ఐఎఎస్లకు కీలక బాధ్యతలు
13మందికి సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్లు
అమరావతి,ఆగస్ట్ 7 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా కట్టడి కోసం 13 మంది యువ ఐఏఎస్ లను ప్రభుత్వం రంగంలోకి దింపుతోంది. కేసులు శరవేగంగా పెరుగుతున్న నేపధ్యంలో అదుపు చేసేందుకు 2018 బ్యాచ్ ప్రొబేషనర్ ఐఏఎస్లను సబ్ కలెక్టర్లుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 12 మందిని సబ్ కలెక్టర్లుగా ప్రభుత్వం నియమించింది. క్షేత్ర స్థాయిలో కరోనాకు ఎక్కడికక్కడ బ్రేక్ వేయడంతోపాటు.. కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందించేలా యువ ఐఏఎస్ లకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఇప్పటికే టెస్టులను చేయడంలో దేశంలోనే ముందువరుసలో ఉన్న ఏపీని కరోనా కట్టడిలోనూ అదే స్థాయికి తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
చిత్తూరు డీఆర్డీఏ పీవోగా ఎంఎస్ మురళి నియమితులయ్యారు. అలాగే ప్రస్తుతం రాజంపేట, నరసరావుపేట, కందుకూరు, నూజివీడు, నంద్యాల, టెక్కలి, నర్సీపట్నంలో కొనసాగుతున్న డిప్యూటీ కలెక్టర్లను జీఏడీకు రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. సబ్ కలెక్టర్లుగా నియమితులైన వారి వివరాలు ఇలా ఉన్నాయి. పృధ్వీ తేజ్ ఇమ్మడి – సబ్ కలెక్టర్ కడప,ప్రతిష్ఠ మాంగైన్ – సబ్ కలెక్టర్ నూజివీడు (కృష్ణ),హిమాన్షూ కౌశిక్ – సబ్ కలెక్టర్ అమలాపురం (తూర్పు గోదావరి), అమిలినేని భార్గవ్ తేజ -సబ్ కలెక్టర్ కందుకూరు (ప్రకాశం), విధే ఖారే – సబ్ కలెక్టర్ పార్వతీపురం (విజయనగరం), నారపురెడ్డి మౌర్య – సబ్ కలెక్టర్ నర్సీపట్నం (విశాఖపట్నం), శ్రీవాస్ అజయ్ కుమార్ – సబ్ కలెక్టర్ నరసరావుపేట (గుంటూరు),అనుపమ అంజలి – సబ్ కలెక్టర్ రాజమహేంద్రవరం (తూర్పుగోదావరి),సూరజ్ ధనుంజయ్ – సబ్ కలెక్టర్ టెక్కలి (శ్రీకాకుళం),మేదిడ జాహ్నవి – సబ్ కలెక్టర్ మదనపల్లి (చిత్తూరు),కల్పన కుమారి – సబ్ కలెక్టర్ నంద్యాల (కర్నూల్),కేతన గార్గ్ – సబ్ కలెక్టర్ రాజంపేట (కడప).