కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేడు,రేపు నిరసన – విప్లవ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు
: కేంద్ర ప్రభుత్వం ప్రజలకు కాపలాదారుగా ఉంటానని లూటీదారులుగా వ్యవహరిస్తున్నారని విప్లవ కార్మిక సంఘం జేఏసీ నాయకులు విమర్శించారు. ఈ మేరకు మంగళవారం గోదావరి ఖని పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. బొగ్గు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ నేడు, రేపు సింగరేణి వ్యాప్తంగా చేపట్టనున్న నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్డీయే పాలకులు స్వదేశీ, జాతీయత ముసుగులో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటీకరణ కావిస్తున్నార ని విమర్శించారు. దీంతో కార్పొరేట్ సంస్థలకు 50 వేల కోట్ల నిధులను సమకూరుస్తున్నదని ఆరోపించారు.
గతంలో బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సంస్థల్లోని వాటాలను విక్రయించి, ప్రజలచే ఎన్నుకున్న ప్రభుత్వాలే ప్రజలను నట్టేట ముంచుతున్నారని విమర్శించారు. ఇలాంటి కుటిల యత్నాలతో ప్రభుత్వ రంగ సంస్థలు నిలిచే అవకాశం లేకుండా చేస్తున్నారని అన్నారు. బీఎస్ఎన్ఎల్ సంస్థలోని ఎంతో మంది ఉద్యోగులను ఇంటికి పంపి రిలయన్స్ వారి జియో కంపెనీ అభివృద్ధికి కంకణం కట్టుకున్న ఘనత మోదీదేనని ఎద్దేవా చేశారు. కరోనా నేపథ్యంలో 20 లక్షల ప్యాకేజీ ఆసరగా నగదు ఇచ్చి 3500 కోట్లు బ్యాంకుల ద్వారా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రక్షణరంగ, అణు, అంతరిక్ష సంస్థల ఎఫ్డీఐలకు అప్పజెప్పేలా కుయుక్తులకు పాల్పడుతున్నారని అన్నారు. ఇలాంటి ప్రబుత్వ రంగ వ్యతిరేక విధానాలను విడనాడకపోతే కార్మిక రంగం ఏకమై బుద్దిచెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు టీ. శ్రీనివాస్, కె. విశ్వనాథ్, ఎం.ఏ గౌస్, రాములు, ఇ. నరేశ్, యం. దుర్గయ్య, రాజేందర్, నంబులాద్రి ఉన్నారు.