రాష్ట్రంలో మునిసిపల్, కార్పొరేషన్లలో జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్య ఎన్నికలు కావని సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. డబ్బు, మద్యానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య జరిగిన ఎన్నికలని సిఎల్పి నేత పేర్కొన్నారు.ఈ మేరకు శుక్రవారం ఖమ్మంలో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మునిసిపల్ ఎన్నికలు టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన ఎన్నికలు కావని విచ్చలవిడి మద్యం, విపరీతమైన డబ్బులు, ప్రలోభాలకు, ప్రజాస్వామ్యమైన కాంగ్రెస్ పార్టీకి మధ్య జరిగిన ఎన్నికలని పేర్కొన్నారు. కేసీఆర్ తన అవినీతి అక్రమలతో కూడగట్టిన వేల కోట్ల రూపాయాలతో వోటు విలువను దిగజార్చే కుట్ర చేస్తున్నారని విమర్శించారు.
ఎన్నికలు అంటే మద్యం, డబ్బులు అనే విధంగా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. సామాన్యులు, మధ్య తరగతి వారు రాజకీయాల్లో పాల్గొనకుండా మద్యం వ్యాపారులు, వోట్లను కొనుగోలు చేసే వారు మాత్రమే రాజకీయాలు చేసే విధంగా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలను కలుషితం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను పాతర వేస్తున్న వారి నుంచి రాజకీయాలను కాపాడాలని అందుకోసం మేధావులు, ప్రజాస్వామిక వాదులు, చైతన్య వంతులు అంత కలిసి కట్టుగా పోరాటం చేయాలని కోరారు.ఇంత పెద్దఎత్తున దుర్మార్గాలు, డబ్బులు, దౌర్జన్యాలు, మద్యం పంపిణీ జరిగినా కాంగ్రెస్ కార్యకర్తలు మొక్కవోని ధైర్యంతో రక్తం చిందించి టిఆర్ఎస్ నేతల ఆగడాలను అడ్డుకున్నారని తెలిపారు. రాబోయేది కాంగ్రెస్ పార్టీనే అని, ధైర్యంగా ఉండాలని ఆయన కార్యకర్తలకు ధైర్యం ఇచ్చారు.