- పునర్నిర్మాణం అంటే భూస్వామ్య విధానం పెత్తనాన్ని తిరిగి తేవడమా.?
- ఉదండాపూర్ భూనిర్వాసితులకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీని అందేలా పోరాడుతాం….గడీల పాలన అంతమొందిస్తాం
- మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ మార్చినందుకా దశాబ్ది ఉత్సవాలు
- కెసిఆర్ పాలనలో లక్షల కోట్ల అప్పులపై ప్రజలకు వివరిస్తాం: ప్రజాతంత్రతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
మహబూబ్నగర్, ప్రజాతంత్ర, మే 23 : నీళ్లు, నిధులు, నియామకాలు, సంపద, ఆత్మ గౌరవం కోసం పోరాటాలు బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం 70, 80 ఏళ్ల క్రింద ఉన్న జాగీరుదారుల భూస్వామ్య విధానం పెత్తనాన్ని పెంచి పోషిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చి రైతులను మోసం చేస్తూ నియామకాలు చేపట్టక యువత పెడదోవన పడుతున్నారని మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా మార్చి పేద ప్రజల బహుజనులు బలహీనవర్గాలు మైనార్టీలు ఎస్సీ, ఎస్టీ గిరిజనులు ఆదివాసి బిడ్డలకు అన్యాయం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆగం, అన్యాయం అయ్యిందని కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ప్రజాతంత్రతో మంగళవారం తెలిపారు. 70 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి మా భూములు మాకు కావాలని పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 40, 50 సంవత్సరాల క్రితం రైతులు బలహీనవర్గాల వారు తెల్ల కాగితంపై నిబంధనలు రాసుకొని తమ భూములను సాగు చేసుకుంటూ బ్రతుకు కొనసాగిస్తున్న వారి ఒకేసారి ఆ నిబంధనలను ఎత్తివేసి ధరణి పేరిట ఆ భూములను బలహీనుల నుండి మళ్లీ భూస్వాములకు వందల వేల ఎకరాలను ఇచ్చి అన్నదాతలకు అన్యాయం చేశారని తెలిపారు.
68 రోజులుగా కొనసాగుతున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో అనేక ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా చూశానని అందులో భాగంగా మంగళవారం రోజు నవపేట్ మండలం ఇప్పటూరు గ్రామంలో శిథిలావస్థలో ఉన్న గడిని చూశానని గత భూస్వాములు తెల్ల కాగితంపై బడుగు బలహీనలకు నాడు నిర్ణయించిన ధర మేరకు తెల్ల కాగితంపై నిబంధన రాసుకొని జీవనం కొనసాగిస్తున్న వారి భూహక్కులను హరించి ఇక్కడో విదేశాల్లో ఉన్నటువంటి వారి సంతతి మనుమండ్లు మునిమనముల పేరిట ధరణిలో చేయించుకొని అమ్ముకుంటున్నారని ఇపుటూరు బాధితులు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. నాడు స్వాతంత్రం కోసం దేశమంతా పోరాటం చేస్తుంటే తెలంగాణలో భూ పోరాటమే కొనసాగిందని దున్నేవాడిదే భూమి అనే నినాదంతో ఉద్యమించిన ప్రాంతమని 1952 సంవత్సరం తర్వాత తెలంగాణ టెనెన్సీ ఆక్ట్ భూ సంస్కరణ ద్వారా మిగులు భూములు అసైన్డ్ వంటివి ఆనాడు తీసుకున్న అనంతరం వచ్చిన ప్రజా ఉద్యమాలు లెఫ్ట్ వింగ్ జెండాలు పాతి దొరలు భూస్వాములు జాగిర్దారులు అప్పటి భూములు పంచారని కానీ దశాబ్దాల పాటు వ్యవసాయం చేసుకుంటూ ఆయా గ్రామాల్లో బలహీనవర్గాలు బ్రతుకుతూ ఉన్నాయని అలాంటి వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పేరుతో అన్యాయం చేశానన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణం అంటే 70, 80 ఏళ్ల కింద ఉన్న జాగిర్దారు భూస్వామ్య విధాన పెత్తనాన్ని తిరిగి కట్ట పెట్టడమే పునర్నిర్మాణమా ప్రజలు తెలుసుకొని చైతన్యవంతులు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న పాలనా విధానాన్ని మేధావులు గుర్తించాలన్నారు అలాగే మహబూబ్నగర్ జిల్లాలో చేపడుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉదండాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితుల బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి నష్టపోతున్న వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అందేలా పోరాటం చేస్తామని తెలిపారు. 2013 భూ సేకరణ చట్టం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఈ భూ సేకరణ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్రతో కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని తెలిపారు. భారత్ జూడో యాత్రలో రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా అనేక వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకున్నారని అర్థం చేసుకొని ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఇటీవల జరిగినటువంటి కర్ణాటక ఎన్నికల్లో మేనిఫెస్టో తయారు చేశారని అలాగే మూడు మాసాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలతో పాటు చతిస్గడ్ రాజస్థాన్ల లోను మేనిఫెస్టోలను పెట్టడమే కాకుండా వాటిని అమలు చేయడమే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం లక్ష్యం అని తెలిపారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాల పేరిట హంగు ఆర్భాటాలతో కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. గడిచిన పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చినందుకు వేల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందు కా నియామకాలు లేక నిరుద్యోగ యువత పెడదోవన పడుతున్నందుకా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సాధించింది ఏంటి అని ప్రశ్నించారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ తరఫున ఊరు వాడ ప్రతిచోట తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నందుకు సంబరాలు పాల్గొంటాం కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాల్లో సీఎం కేసీఆర్ వచ్చిన సంపద లక్షల కోట్ల అప్పులపై మేధావులు ఆలోచించాలన్నారు. కొలువులు రానందుకు ఇల్లు లేని వారికి ఇల్లు వచ్చాయా స్థలం కేటాయిస్తామన్న వారికి బడుగు బలహీనులకు స్థలాలు కేటాయించారు భూములు ఏమైనా పంచారా అనే విషయాలను యువత ఆలోచించాలన్నారు.