- భూ కుంభకోణాలకు అడ్డాగా కేటీఆర్ అండ్ బ్యాచ్
- కాంగ్రెసు పాలన రాగానే విఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తాం
- హాత్• సే హాత్ జోడో యాత్రలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- భూ కబ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా అంటూ మంత్రి కేటీఆర్కు సవాల్
మరిపెడ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 09 : నాపై ఏ ఆరోపణ ఉన్నా సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం..మీ పై, మీ ప్రభుత్వంపై నేను చేస్తున్న ఆరోపణలపై జడ్జితో విచారణకు సిద్ధంగా ఉండాలని మంత్రి కేటీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లంచ్ పాయింట్ వద్ద గురువారం మీడియాతో మాట్లాడుతూ…‘‘భూమి తల్లితో సమానం. సాయుధ రైతాంగం పోరాటం, 1969లో తెలంగాణ ఉద్యమం భూముల కోసమే జరిగింది. ధరణి వ్యవస్థను తీసుకొచ్చి రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిలాల్లో నిజాం ముందు నుంచి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను డ్రామారావు, మిత్ర బృందం కొల్లగొట్టింది. వారి మాట వినే కలెక్టర్ల ద్వారా భూ దోపిడికి పాల్పడ్డారు. నేను భూదందాలకు పాల్పుడుతున్నా అని కేటీఆర్ ఆరోపణ చేశారు. నాపై ఏ ఆరోపణ ఉన్నా సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం.
అదే విధంగా 2014 నుంచి ఇప్పటి వరకు సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిలాల్లో జరిగిన భూ లావాదేవీలపై, 2004-14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ అంటే నిషేధిత జాబితాలో చేర్చిన భూముల్లో ఎన్నివేల ఎకరాల భూములను ఆ జాబితా నుంచి తొలగించారు..ఎవరెవరి పేర్ల మీద బదలాయించారో సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలని కేటీఆర్ కు సవాలు విసురుతున్నా. అమెరికన్ కంపెనీని బెదిరించి తెల్లపూర్ లోని 100 ఎకరాల రూ. 5 వేల కోట్ల విలువైన భూములను రూ.260 కోట్లకే ప్రతిమ శ్రీనివాస్ పేరిట బదలాయించారు. అందులో వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. అందులో కేటీఆర్కు భాగస్వామ్యం ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఆంధ్రా నేత తోట చంద్రశేఖర్కు మియాపూర్లో ఎకరా 100 కోట్లు ఉండే 50 ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెట్టింది. మియాపూర్లో సర్వే నెంబర్ 80లో రూ. 500 కోట్ల విలువైన 5 ఎకరాల భూమి ఏవిధంగా వొచ్చింది. ఇది ప్రభుత్వ భూమి.
ఈ భూమి బదిలీ కోసమే రెడ్యా నాయక్ను పార్టీ మార్పించింది వారి కూతురు కవిత. కూతురు భూ దాహం కోసమే రెడ్యా నాయక్ పార్టీ మారారు. కవిత ఈ విషయంపై చర్చకు రావాలని సవాల్ విసురుతున్నా. మీపై, మీ ప్రభుత్వంపై నేను చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధంగా ఉండాలి’’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీ కొడుకు చేసే భూ దందాలు కనిపించడం లేదా? దృతరాష్టుడిలా కళ్లు మూసుకున్నారా…అని ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గడీల పాలనకు వ్యతిరేకం. మేం అధికారంలోకి వొస్తే ప్రగతి భవన్ను డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ నాలెడ్జ్ సెంటర్గా మారుస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే 10 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వొస్తుంది. అక్రమాలకు పాల్పడిన సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి కలెక్టర్ లను జైలుకు పంపించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని రేవంత్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ను పాతాళానికి తొక్కేందుకే పాద యాత్ర
తెలంగాణలో రాక్షస పాలన అందిస్తూ, దోపిడీలు చేస్తున్న పాపాల భైరవుడైన కేసీఆర్ను పాతాళానికి తొక్కేందుకే ఈ యాత్ర చేస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హాత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా నర్సింహులుపేట మండలం నాగారం నుంచి మర్రిపెడ బంగ్లా వరకు దాదాపు 11 కిలోమీటర్ల వరకు నాలుగో రోజు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం మర్రిపెడ బంగ్లాలో నిర్వహించిన జన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. దేశంలో బీజేపీ సాగిస్తున్న విధ్వంసకర పాలనకు వ్యతిరేకంగా జాతి సమైక్యత కోసం రాహుల్ గాంధీ కన్యాకూమారి నుంచి కాశ్మీర్ వరకు 4 వేల కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశారు. డోర్నకల్లో 14 సార్లు ఎన్నికలు జరిగితే 12 సార్లు కాంగ్రెస్ జెండా ఎగరేసిన చరిత్ర ఈ గడ్డది.
తెలంగాణలో రాక్షస పాలన అందిస్తూ, దోపిడీలు చేస్తున్న పాపాల భైరవుడైన కేసీఆర్ను పాతాళానికి తొక్కేందుకే ఈ యాత్ర చేస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హాత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా నర్సింహులుపేట మండలం నాగారం నుంచి మర్రిపెడ బంగ్లా వరకు దాదాపు 11 కిలోమీటర్ల వరకు నాలుగో రోజు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం మర్రిపెడ బంగ్లాలో నిర్వహించిన జన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. దేశంలో బీజేపీ సాగిస్తున్న విధ్వంసకర పాలనకు వ్యతిరేకంగా జాతి సమైక్యత కోసం రాహుల్ గాంధీ కన్యాకూమారి నుంచి కాశ్మీర్ వరకు 4 వేల కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశారు. డోర్నకల్లో 14 సార్లు ఎన్నికలు జరిగితే 12 సార్లు కాంగ్రెస్ జెండా ఎగరేసిన చరిత్ర ఈ గడ్డది.
‘‘రాష్ట్రంలో కేసీఆర్ దోపీడి చేస్తుంటే ఇక్కడ రెడ్యానాయక్ నయా జమీందారుగా తయారై ప్రజలను పీడిస్తున్నాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. తండ్రో దిక్కు, కొడుకో దిక్కు, కూతురో దిక్కు దోచుకుంటున్నారు. అకేరు, మానేరు, పాలేరు వాగుల్లో ఇసుక దందా మొత్తం వాళ్లదే. మిల్లర్ల రూపంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కూడా దోచుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఏవీ ముందుగా వారి కుటుంబానికి నైవేద్యం పెట్టాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఇవాళ నియోజకవర్గంలో నెలకొన్న దుస్థితికి రెడ్యానాయక్ కుటుంబమే కారణం ’’ అని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో రెడ్యానాయక్ ఓడించాలని మా యువకులు ఇక్కడకు వచ్చారని సభకు వచ్చిన వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాదయాత్రలో భాగంగా వీఆర్ఏలు, ఐకేపీ సంఘాల వారిని, రైతులు, విద్యార్ధులు, గిరిజనులు, ఉపాధ్యాయుల తదితరుల సమస్యలను తెలుసుకోవడంతోపాటు అవినీతి కారణంగా మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూడటం జరిగిందన్నారు.
రాష్ట్రంలో ఐకేపీ సంఘాలకు దిక్కులేదు. వీఆర్ఏ లకు అసెంబ్లీ సాక్షిగా తండ్రికొడుకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మిర్చి పంటకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు గోస పడుతున్నారు. గురుకుల టీచర్లకు చాలీచాలని జీతాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి రైతుల గోస ఇక వర్ణనాతీతం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మధ్యలోనే ఆపేశారు. ఆయన గడీని తొమ్మిది నెలల్లో కట్టుకున్న కేసీఆర్…నాలుగేళ్లయినా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తి చేయలేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అలాంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘బుధవారం మహబూబాబాద్లో చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే, ఎంపీ మాట్లాడింరంట. ఆ ఎమ్మెల్యే కనుసైగ చేస్తే నేను మర్రిపెడ కూడా దాటనంట. ఆ ఎమ్మెల్యేకు చెప్పదలుచుకున్నా. నీతోని కాదుగానీ.. ఏట్లో రావులందరిని తీసుకునిరా..మరిపెడ చౌరస్తాలో నెత్తిమీద కాలు పెట్టి తొక్కుకుంటూ పోకపోతే మా కాంగ్రెస్ కార్యకర్తలు పేరు మార్చుకుంటారని’’ అని బీఆర్ఎస్ నాయకులను రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గూడు నుంచి గుడుంబా వరకు ఎమ్మెల్యే కుటుంబమే దందాలు చేస్తే అంతకుమించిన దౌర్భగ్యం ఉంటుందా అని నేను అడుగుతున్నా.
ప్రగతి భవన్లో ప్రజలకు ఎందుకు ప్రవేశం లేదు..? ప్రగతి భవన్ గుడుపుఠాని ఏందీ? అందులో వేల కోట్ల కథ ఏందీ? పేదల చెమట వాసనకంటే కాంట్రాక్టర్ల సెంటు వాసన కేసీఆర్కు ఇంపుగా ఉందా? మళ్లీ చెబుతున్నా..ఆ ప్రగతి భవన్ గేట్లు బద్దలుకొడతామని అన్నారు. ఎన్ని వందల కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. నువ్వు శాశ్వతం అనుకున్న గడీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. ప్రగతి భవన్ను డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ విజ్ఞాన కేంద్రంగా మారుస్తాం. పోలీసులను నమ్ముకుని నేను పాదయాత్ర చేయడం లేదు. మా కాంగ్రెస్ కార్యకర్తలను నమ్ముకుని యాత్ర చేస్తున్నా. ధరణి సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల నిర్మాణానికి రూ. 5 లక్షలు, పంటకు గిట్టుబాటు ధర, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, ఆరోగ్య శ్రీ బకాయిలు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం కావాలంటే కేసీఆర్ పోవాలి.