బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్
కలసివచ్చిన సంఘ్ పరివార్తో సాన్నిహిత్యం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కరీంనగర్ ఎంపి బండి సంజయ్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంజయ్ని నియమించినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ బుధవారం జారీ చేసిన ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా డా.కె.లక్ష్మణ్ వ్యవహరిస్తున్నారు. ఆయన స్థానంలో కొత్త నేతను ఎంపిక చేయాలని భావించిన పార్టీ అధిష్టానం కొద్ది రోజుల పాటు కసరత్తు నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్తో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, పార్టీ సీనియర్ నేత డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి పేర్లను సైతం పరిశీలించింది.
లక్ష్మణ్నే తిరిగి రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగించనున్నారని సైతం పార్టీ వర్గలలో చర్చ జరిగింది. అయితే, బీజేపీ జాతీయ నాయకత్వం బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా సంజయ్ వైపే మొగ్గు చూపింది. అయితే, సంజయ్ గతంలో ఆర్ఎస్ఎస్లో కీలక భూమిక పోషించారు. ప్రస్తుతం కూడా ఆయన ఆర్ఎస్ఎస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆయనకు ఆర్ఎస్ఎస్లోని కీలక నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలే ఆయనను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వరించడానికి కలసి వచ్చిన అంశంగా పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అంతేకాకుండా విడ్యార్థి దశ నుంచి ఏబీవీపీలో పలు కీలక పదవులు నిర్వహించారు. దీంతో పాటు సామాజిక సమీకరణాలు సైతం సంజయ్ ఎంపికకు కలసి వచ్చాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన సంజయ్ తన నియోజకవర్గమైన కరీంనగర్తో పాటు రాష్ట్రమంతా తన సామాజికవర్గంలో బలమైన నేతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.